ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , First Publish Date - 2022-01-18T05:54:58+05:30 IST
ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి, కనుమ, ముక్కొనుమ పండగలు పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి అత్తమామలు, తల్లిదండ్రుల ఇళ్లకు వచ్చిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు.
తిరుగు ప్రయాణికులతో రద్దీ
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనం
అనకాపల్లి టౌన్, జనవరి 17: ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి, కనుమ, ముక్కొనుమ పండగలు పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి అత్తమామలు, తల్లిదండ్రుల ఇళ్లకు వచ్చిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కాంప్లెక్స్ సందడిగా కనిపించింది. ముఖ్యంగా పాసింజర్ ప్లాట్ఫారం ప్రయాణికులతో రద్దీగా ఉండగా, ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం అందుకు భిన్నంగా ఉండడం విశేషం. జిల్లా నలుమూలలు, విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ప్రయాణికులతో కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి కాంప్లెక్స్లో పెద్దగా ప్రయాణికుల అలికిడి లేకపోయినా, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా పెద్దగా ఓఆర్ లభించలేదని డిపో అధికారులు చెబుతున్నారు. కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతిలో ఓఆర్ 72 నుంచి 75 శాతం మాత్రమే లభించిందని చెప్పారు.