సిబ్బందికి డబుల్ మాస్కులివ్వండి
ABN , First Publish Date - 2021-04-23T10:24:51+05:30 IST
కండక్టర్లు, డ్రైవర్లతోపాట గ్యారేజీ, కాంట్రాక్ట్ సిబ్బందికి తక్షణమే డబుల్ లేయర్ మాస్క్లు ఇవ్వాలని, తగినంత శానిటైజర్ అందుబాటులో ఉంచాలని
బస్సులను శానిటైజ్ చేయించాలి
45ఏళ్లు పైబడిన అందరికీ టీకా: ఆర్టీసీ ఎండీ ఆదేశాలు
అమరావతి, విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కండక్టర్లు, డ్రైవర్లతోపాట గ్యారేజీ, కాంట్రాక్ట్ సిబ్బందికి తక్షణమే డబుల్ లేయర్ మాస్క్లు ఇవ్వాలని, తగినంత శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లను ఆదేశించారు. బస్సులను శానిటైజ్ చేయించాలని, 45 ఏళ్లు పైబడిన ప్రతి ఉద్యోగికీ కొవిడ్ టీకా వేయించాలని కోరారు. మాస్కులు లేకుండా వచ్చే ప్రయాణికులు కొనుగోలు చేసేందుకు బస్టాండ్ల్లో వాటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజారవాణా సంస్థ బస్సుల్లో ఇబ్బందులపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. గురువారం మధ్యాహ్నం వర్చువల్ సమావేశంలో ఎండీ డిపోల మేనేజర్లతో చర్చించారు. ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలుకొని సిబ్బందికి ఎదురవుతన్న ఇబ్బందులపై ఆరా తీశారు.
కొవిడ్ సోకిన వారికి 14రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఈయూ, ఎన్ఎంయూ రాష్ట్ర నాయకులు పలుమార్లు కోరిన విషయాన్ని అధికారులు ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. సిక్ లీవులు మంజూరు చేయాలని లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి విధానం అమల్లో ఉందో అదే వర్తింపజేయాలని ఎండీ సూచించారు. అయితే సీట్ల మధ్య బౌతిక దూరం గురించి స్పష్టమైన ఆదేశాలు అందలేదని డిపోస్థాయి అధికారులు చెబుతున్నారు.
50 శాతం సీటింగ్ అమలు చేయండి: ఎన్ఎంయూఏ
బస్సుల్లో 50 శాతం సీటింగ్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణారెడ్డి ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. గురువారం గూగల్ మీట్లో ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్, జిల్లాల రీజినల్ మేనేజర్లతో ఆయన కొవిడ్పై చర్చించారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో గతంలో మాదిరిగా 50 శాతం సీటింగ్ తప్పనిసరి చేయాలని కోరారు. వీలైనంత వరకు కండక్టర్లను గ్రౌండ్ బుకింగ్ సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీకి చెందిన అన్ని కార్యాలయాలు, వర్క్షాపులు, గ్యారేజీలలో 50 శాతం ఉద్యోగులతో పనిచేయించాలని, దీని కోసం షిప్టు పద్ధతులను పాటించాలని కోరారు. వయోనిబంధన లేకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న అందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు.