ఆదాయ అన్వేషణలో ఆర్టీసీ

ABN , First Publish Date - 2021-09-19T05:05:16+05:30 IST

కొవిడ్‌ కారణం గా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రజా రవాణా శాఖ ఆదాయ అన్వేషణ ముమ్మరంగా సాగిస్తోంది. కొత్త ఆలోచనలతో, సరికొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళుతోంది.

ఆదాయ అన్వేషణలో ఆర్టీసీ
విలేకరులతో మాట్లాడుతున్న ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్యచౌదరి

తొలుత కార్గో సేవలు, షాపింగ్‌ మాల్స్‌
త్వరలో వాణిజ్య సముదాయాలు
22న బిజినెస్‌ మీట్‌ : ఆర్‌ఎం వీరయ్య చౌదరి


ఏలూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణం గా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రజా రవాణా శాఖ ఆదాయ అన్వేషణ ముమ్మరంగా సాగిస్తోంది. కొత్త ఆలోచనలతో, సరికొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళుతోంది. మొన్న షాపింగ్‌ మాళ్ల తో, నిన్న పెట్రోలు బంకు ఏర్పాటుతో జోరు మీదున్న జిల్లా ప్రజా రవాణా శాఖ తాజాగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భూములను బాడుగకు ఇచ్చి ఆదాయా న్ని పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 22న బిజినెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఆర్‌ఎం వీరయ్యచౌదరి శనివారం విలేకరులతో మాట్లాడారు.
 

కార్గో సేవల జోరు..

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజా రవాణాశాఖ కుదేలైపోయింది. ఆ సమయంలో కూడా నిరాశ చెందకుండా కార్గో సేవలతో జోరు పెంచింది. కిందటేడాది లాక్‌డౌన్‌ కారణంగా కార్గో ఆదాయం 3.1 కోట్ల వరకూ పెరిగింది. ఈ ఏడాది 4 కోట్ల ఆదా యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికి బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్ధతిలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలోనే ఏలూరు, అత్తిలి ఆర్టీసీ ప్రాంగణాల్లో షాపింగ్‌ మాళ్లు ఏర్పాటుకి అనుమతించగా విశేష స్పందన లభించింది. ఇటీవల  ఏలూరులో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయగా దానికి కూడా విశేష ఆదరణ లభించింది. ఏలూరులోని గ్యారేజీ వెనుక భాగంలో ఉన్న 2.61 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పీటీడీ స్థలాలను కూడా బీవోటీ పద్ధతిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికోసం ఆర్‌ఎం ఈనెల 22న ఏలూరులోని తన కార్యాలయంలో బిజినెస్‌ మీట్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-19T05:05:16+05:30 IST