ప్రయాణికుల ఆక్యుపెన్సీపై RTC దృష్టి.. సజ్జనార్‌ ఫోకస్‌

ABN , First Publish Date - 2022-05-16T17:52:12+05:30 IST

ప్రయాణికుల ఆక్యుపెన్సీపై RTC దృష్టి.. సజ్జనార్‌ ఫోకస్‌

ప్రయాణికుల ఆక్యుపెన్సీపై RTC దృష్టి.. సజ్జనార్‌ ఫోకస్‌

  • రద్దీ రూట్లలో గంటల వారీగా ప్రయాణికుల లెక్క 
  • ప్రతి గురువారం అధికారులు సిటీ బస్సుల్లో ప్రయాణం
  • ఆదాయం పెంపునకు వంద రోజుల ప్రణాళిక
  • ఆక్యుపెన్సీ పెంచితే ప్రోత్సాహకాలు

హైదరాబాద్‌ సిటీ : సిటీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు ఉన్న మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించింది. కొన్ని నెలలుగా సిటీ బస్సుల్లో  ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో పెరగలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొనడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రేటర్‌ జోన్‌ 29 డిపోల పరిధిలో రద్దీ రూట్ల లెక్కలు తీస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. గ్రేటర్‌ జోన్‌ వ్యాప్తంగా 850కి పైగా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. రద్దీ రూట్లలో ప్రధాన బస్టా్‌పలు, రద్దీ పాయింట్లలో సూపర్‌వైజర్లను నియమిస్తూ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల ట్రిప్పులు పెంచే అవకాశాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు లేని రూట్లలో ట్రిప్పులు తగ్గించి వాటిని రద్దీ రూట్లకు మళ్లించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ 60 శాతం కంటే తక్కువగా నమోదయ్యే డిపోలను క్రమంగా 80 శాతం పెంచాలని టార్గెట్లు విధిస్తున్నారు.


వారంలో ఒక రోజు బస్సుల్లో ప్రయాణం..

ఆర్టీసీ ఉన్నతాధికారులు, డిపోల డీఎంలు ప్రతి గురువారం బస్సుల్లోనే కార్యాలయాలకు రావాలంటూ ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సేవలు మెరుగుపరిచేందుకు కావాల్సిన సూచనలు తీసుకుంటున్నారు. రద్దీ రూట్లలో గంటల వారీగా ఆక్యుపెన్సీ నమోదు చేయాలని ఆదేశించారు. కాలనీలు, బస్తీల నుంచి పెద్దసంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు సాగించే రూట్లు గుర్తించి అందుబాటులోకి తెచ్చేలా రూట్‌మ్యా్‌పలు సిద్దం చేస్తున్నారు.  ఏడాదిన్నరగా కొవిడ్‌ కారణాలతో తగ్గిన బస్సుల ట్రిప్పులను పూర్తిస్థాయిలో నడపడంతో పాటు రద్దీప్రాంతాల్లో నైట్‌రైడర్స్‌ పేరుతో ఉదయం 3.30 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. 


గ్రేటర్‌పై ఎండీ సజ్జనార్‌ ఫోకస్‌

ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో 40 శాతం గ్రేటర్‌ పరిధిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టారు. గ్రేటర్‌ జోన్‌లోని 29 డిపోల్లో 10 డిపోల్లో ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో నమోదు కావడం లేదు. ఆక్యుపెన్సీ పెంచే అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని ఆర్టీసీ భావిస్తోంది. గ్రేటర్‌ ఆపరేషన్స్‌పై ప్రత్యేక దృష్టిసారించిన ఎండీ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బస్టా్‌పలు, బస్‌ షెల్టర్లలో బస్‌ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు.

Updated Date - 2022-05-16T17:52:12+05:30 IST