అన్నాచెల్లెళ్ల బంధం ‘ప్రేమ’గా వదంతి!

ABN , First Publish Date - 2022-08-11T08:49:56+05:30 IST

అన్నాచెల్లెళ్లుగా ఉంటున్న తమపై ప్రేమికులనే ముద్రవేశారనే ఆవేదనతో యువకుడు, బాలిక పురుగుల మందు తాగారు.

అన్నాచెల్లెళ్ల బంధం ‘ప్రేమ’గా వదంతి!

యువకుడు, బాలిక కలత.. పురుగుల మందు తాగిన ఇద్దరు

అతడి మృతి.. ఆమె పరిస్థితి విషమం


సుభాష్‌నగర్‌, ఆగస్టు 10 (నిజామాబాద్‌): అన్నాచెల్లెళ్లుగా ఉంటున్న తమపై ప్రేమికులనే ముద్రవేశారనే ఆవేదనతో యువకుడు, బాలిక పురుగుల మందు తాగారు. యువకుడు మృతిచెందగా, బాలిక ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌ కుమార్‌ (22), తొండకూర్‌ గ్రామానికి చెందిన బాలిక చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూల్లో చదవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు అన్నాచెల్లెళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. వినయ్‌ ప్రస్తుతం నిజామాబాద్‌లో డీఎంఎల్‌టీలో శిక్షణ తీసుకుంటుండగా, ఆమె పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది.


అయితే కొందరు వ్యక్తులు వీరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వదంతులు సృష్టించారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు.. నిజామాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి గడ్డిమందు తాగారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం వినయ్‌ మృతి చెందాడు. బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు పోలీసులు వినయ్‌కుమార్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల బంధం మాత్రమే ఉందని.. కానీ కొందరు రకకాలుగా ప్రచారం చేయడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-11T08:49:56+05:30 IST