రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ టర్కీలో గురువారం

ABN , First Publish Date - 2022-03-09T18:09:13+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ దేశాల

రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ టర్కీలో గురువారం

కీవ్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ దేశాల విదేశాంగ మంత్రులు గురువారం టర్కీలో సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఇరు దేశాలు అంగీకరించాయని టర్కీ దౌత్యవేత్త మెవ్‌లుట్ కవుసోగ్లు చెప్పారు. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరు సమావేశమవుతుండటం ఇదే మొదటిసారి. 


రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా గురువారం టర్కీలో సమావేశమవుతారని టర్కీ దౌత్యవేత్త మెవ్‌లుట్ కవుసోగ్లు ఓ ట్వీట్‌లో తెలిపారు. వీరి చర్చలు శాంతి, సుస్థిరతలకు బాటలు పరుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.  లవ్‌రోవ్ బుధవారం టర్కీ బయల్దేరనున్నట్లు సమాచారం. 


నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ((NATO) సభ్య దేశం టర్కీ. నల్ల సముద్రం సరిహద్దుల్లో రష్యా, ఉక్రెయిన్, టర్కీ ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సయోధ్యకు, మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తామని టర్కీ ప్రకటించింది. ఈ రెండు దేశాలతో టర్కీకి సత్సంబంధాలు ఉన్నాయి. రష్యాపై ఆంక్షలను టర్కీ వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని కూడా ప్రకటించింది. 


టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారని, రష్యా-ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తామని చెప్పారని తెలిపారు. ఈ ప్రతిపాదనను లవ్‌రోవ్ అంగీకరించారన్నారు. శాంతి, సుస్థిరతలకు ఇది మంచి మలుపు అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ తూర్పు, మధ్య ప్రాంతాల్లోని నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తోంది. దాదాపు 20 లక్షల మంది ఉక్రెయినియన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. 


Updated Date - 2022-03-09T18:09:13+05:30 IST