జపాన్‌తో శాంతి చర్చలను నిలిపేసిన రష్యా

ABN , First Publish Date - 2022-03-22T22:33:05+05:30 IST

జపాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలను కొనసాగించబోమని రష్యా

జపాన్‌తో శాంతి చర్చలను నిలిపేసిన రష్యా

మాస్కో : జపాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలను కొనసాగించబోమని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివాదంలోని నాలుగు పసిఫిక్ దీవులకు వీసా లేకుండా ప్రయాణించేందుకు జపనీయులకు కల్పించిన అవకాశాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ దీవుల్లో ఉమ్మడి ఆర్థిక కార్యకలాపాలను ఏర్పాటు చేసుకునేందుకు జరుగుతున్న చర్చల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. జపాన్‌కుగల నల్ల సముద్రం ఆర్థిక సహకార సంస్థలో సెక్టోరల్ డయలాగ్ పార్టనర్ హోదాను కూడా తొలగిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ వివరాలను చైనా వార్తా సంస్థ వెల్లడించింది. 


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలతో పాటు జపాన్ కూడా ఆంక్షలు విధించింది. 76 మంది రష్యన్లు, ఏడు బ్యాంకులు, 12 వ్యవస్థలు ఈ ఆంక్షల పరిధిలో ఉన్నాయి. రక్షణ రంగ అధికారులు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుధాల ఎగుమతిదారు రోసోబోరోన్ఎక్స్‌పోర్టు కూడా ఈ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. 


రష్యా తీసుకున్న చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడ మంగళవారం తీవ్రంగా ఖండించారు. ఈ పరిస్థితికి కారణం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న  రష్యాయేనని ఆరోపించారు. దీనిని జపాన్-రష్యా సంబంధాలపై తోసేస్తూ రష్యా స్పందించిన తీరు పూర్తిగా అన్యాయంగా ఉందన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 


రష్యాలోని సదరన్ కురిల్స్, జపాన్‌లోని ఉత్తర భూభాగాల్లో ఈ దీవులు ఉన్నాయి. వీటిపై హక్కు తమదేనని ఇరు దేశాలు చెప్తుండటంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కుదరలేదు. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో ఈ దీవులను సోవియెట్ యూనియన్ స్వాధీనం చేసుకుంది. యుద్దం తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు మారడం సహజమేనని, ఈ దీవులను తాము స్వాధీనం చేసుకోవడంలో తప్పులేదని రష్యా వాదిస్తోంది. దీనిని జపాన్ అంగీకరించడం లేదు.



Updated Date - 2022-03-22T22:33:05+05:30 IST