శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ అవుట్!
ABN , First Publish Date - 2022-02-26T22:42:36+05:30 IST
శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ మొత్తానికి టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు
ధర్మశాల: శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ మొత్తానికి టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న గైక్వాడ్ లక్నోలో జరిగిన తొలి మ్యాచ్కు కూడా ఇదే కారణంతో సెలక్షన్కు దూరమయ్యాడు. మణికట్టు వద్ద తీవ్రమైన నొప్పి ఉన్నట్టు చెప్పడంతో బీసీసీఐ వైద్య బృందం గురువారం అతడిని పరీక్షించింది.
గైక్వాడ్ త్వరలోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు చేరుకుంటాడని బీసీసీఐ తెలిపింది. గాయపడిన గైక్వాడ్ స్థానంలో మయాంక్ అగర్వాల్కు జట్టులో స్థానం కల్పించింది. శ్రీలంకతో జరిగే మిగతా రెండు టీ20లకు అతడు అందుబాటులో ఉంటాడని పేర్కొంది.