ఉద్యోగమిచ్చాక తొలిగింపా...!
ABN , First Publish Date - 2020-11-27T05:45:09+05:30 IST
సచివాలయ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్(వీఏఏ) పోస్టుల భర్తీలో గందరగోళం నెలకొంది. పరీక్షలకు హాజరై ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించడం తోపాటు విధులు చేపట్టిన అనంతరం
నియామక పత్రాలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు
అయోమయంలో సచివాలయ వీఏఏ అభ్యర్థులు
నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 26 : సచివాలయ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్(వీఏఏ) పోస్టుల భర్తీలో గందరగోళం నెలకొంది. పరీక్షలకు హాజరై ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించడం తోపాటు విధులు చేపట్టిన అనంతరం నియామక పత్రాలు తిరిగివ్వాలని వ్యవసాయశాఖ అధికారులు కోరారు. ఉద్యోగం వచ్చిందని ఆనందించేలోపే ఊసూరుమనిపించారు. వివరాల్లోకెలితే.. వీఏఏ పోస్టులకు రాత పరీక్ష అనంతరం సుమారు 80మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. వారికి కలెక్టర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ కేవీఎన్ చక్రధర్బాబు నియామక పత్రాలు అందజేశారు. తదనుగుణంగా వ్యవసాయశాఖ జేడీ వై ఆనందకుమారి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు విధుల్లో చేరిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నా విధుల్లో చేరిన వారిలో 26 మందికి ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్లను తిరిగి ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో వారంతా అవాక్కయ్యారు. ఎందుకు తిరిగివ్వాలని ప్రశ్నించగా అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. నోటిఫికేషన్ జారీ సమయానికి అర్హత ఉండాలనే నిబంధనను వారికి చెప్పి బుజ్జగించారు. అయితే దీనిపై కొందరు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ ఆశలు అడియాశలయ్యాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.