బీజేపీతో పొత్తుపై ఎన్నికల తర్వాత నిర్ణయం : ఎస్ఏడీ
ABN , First Publish Date - 2022-02-20T18:26:13+05:30 IST
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఎన్నికల అనంతరం
చండీగఢ్ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేత బిక్రమ్ సింగ్ మజిథియా చెప్పారు. తన పోరాటం పంజాబ్ ప్రజల కోసమని చెప్పారు. తూర్పు అమృత్సర్ నియోజకవర్గానికి అభివృద్ధి అవసరమన్నారు. ఆయన ఆదివారం ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మజిథియా ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పంజాబ్ ప్రజల కోసమే తన పోరాటమని, తూర్పు అమృత్సర్ నియోజకవర్గానికి అభివృద్ధి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, అహంకారం అణగిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ప్రజలు ఐదేళ్ళు గమనించారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
మజిత, తూర్పు అమృత్సర్ నియోజకవర్గాల నుంచి బిక్రమ్ సింగ్ మజిథియా పోటీ చేస్తున్నారు. తూర్పు అమృత్సర్లో పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో తలపడుతున్నారు.
ఇదిలావుండగా, శిరోమణి అకాలీ దళ్ నేత గుర్బచ్చన్ సింగ్ కూడా బీజేపీతో పొత్తు అవకాశాల గురించి మాట్లాడారు. ఆయన గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్లో ఎస్ఏడీ-బీఎస్పీ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గితే బీజేపీ మద్దతు కోరడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ తమ ప్రథమ శత్రువు అని చెప్పారు.