పాపం మాతృమూర్తులు...!

ABN , First Publish Date - 2021-05-10T04:54:16+05:30 IST

పుట్టిన బిడ్డను కూడా కరోనా వైరస్‌ తల్లి నుంచి వేరు చేస్తోంది. నవమాసాలు మోసి కన్నబిడ్డను చూసుకొనే భాగ్యం కలగనివ్వడం లేదు. ప్రసవం స్త్రీకి పునర్జన్మ వంటిది. దీనిని దాటుకుని వచ్చిన తల్లి తన బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని ప్రసవ బాధను మరిచిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతి పొందుతుంది. ఇలాంటి అనందాన్ని కరోనా వైరస్‌ అమ్మకు దూరం చేస్తోంది. అమ్మతనాన్ని ఆస్వాదించనివ్వడం లేదు.

పాపం మాతృమూర్తులు...!

అమ్మతనాన్ని ఆస్వాదించనివ్వని కరోనా

పుట్టిన వెంటనే పాజిటివ్‌ల నుంచి శిశువు వేరు 

దూరంగా ఉండాల్సి రావడంతో తీవ్ర వేదన 

శృంగవరపుకోట, మే 9:

పుట్టిన బిడ్డను కూడా కరోనా వైరస్‌ తల్లి నుంచి వేరు చేస్తోంది. నవమాసాలు మోసి కన్నబిడ్డను చూసుకొనే భాగ్యం కలగనివ్వడం లేదు. ప్రసవం స్త్రీకి పునర్జన్మ వంటిది. దీనిని దాటుకుని వచ్చిన తల్లి తన బిడ్డను పొత్తిళ్లలోకి  తీసుకుని ప్రసవ బాధను మరిచిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతి పొందుతుంది. ఇలాంటి అనందాన్ని కరోనా వైరస్‌ అమ్మకు దూరం చేస్తోంది. అమ్మతనాన్ని ఆస్వాదించనివ్వడం లేదు. 

పాజిటివ్‌ వచ్చిన తల్లి నుంచి పుట్టిన వెంటనే శిశువును వేరు చేయాల్సి వస్తోంది. కొవిడ్‌-19 సెకెండ్‌ వేవ్‌లో చాలా మంది గర్భిణులు కూడా బాధితులుగా మారుతున్నారు. ఆసుపత్రులకు నెలవారి తనిఖీలకు వెళ్లిన సమయంలోనూ, కొందరు ఇళ్ల వద్ద ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. వారు డెలివరీ సమయంలో పడుతున్న బాధలు వర్ణాణాతీతం. వీరికి ప్రసవం చేసేందుకు స్థానిక ఆసుపత్రులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వీరికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రసవం సమయం దగ్గర పడుతున్న గర్భిణీలంతా ఇక్కడ చేరాలి. అయితే ఇక్కడ చేరిన వారు ప్రసవం జరిగిన వెంటనే శిశువును వైద్యులు దూరంగా ఉంచుతున్నారు. తల్లి నుంచి శుశువుకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం వంద శాతం ఉండడంతో వైద్యుల సూచనతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చేస్తున్నారు. కనీసం బిడ్డను కళ్లారా చూసుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ వైరస్‌ ప్రభావం అంతవేగంగా ఉంటోంది. ఇటీవల వేపాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులతో పాటు వైరస్‌ బారిన పడింది. ప్రసవ సమయం కావడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు జిల్లా కేంద్రాసుపత్రి (మహారాజా)లో చేర్చారు. రెండు రోజుల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవ బాధనుంచి తేరుకొని కళ్లు తెరిచే సమయానికే బిడ్డను వైద్యులు దూరం చేశారు. శిశువును  కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. వారు తల్లిని ఆసుపత్రిలో ఉంచి బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు. తల్లి స్పర్మ లేకుండా నాలుగు రోజులుగా ఆ బిడ్డ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉన్నాడు. పుట్టిన వెంటనే తల్లి పాలు తాగిన శిశువుకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతారు. ఇదే విధంగా తల్లి స్పర్శ బిడ్డకు అనేక రకాల ఉపకారం చేస్తుందని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. బిడ్డకు పాలివ్వని తల్లికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటారు. అందుకే గర్భిణులు ఈ కష్టకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాజిటివ్‌లు వచ్చిన ఇళ్లల్లో గర్భిణులు ఉండకుండా కుటుంబ సభ్యులు ఇతర ప్రదేశాలకు పంపించాలి. 


Updated Date - 2021-05-10T04:54:16+05:30 IST