పరిశ్రమల్లో భద్రత ప్రశ్నార్థకం
ABN , First Publish Date - 2020-07-06T09:59:07+05:30 IST
విశాఖపట్నంలోని పరిశ్రమలు కనీస నిబంధనలు పాటించడం లేదు. అగ్నిమాపక శాఖను పూర్తిగా విస్మరిస్తున్నారు.
కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు
అగ్నిమాపక శాఖ ప్రమాణాలకు తూట్లు
కనరాని ఆక్సిజన్ నిల్వలు
ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ప్రమాదాల్లో బయటపడిన డొల్లతనం
నివారణ చర్యలపై దృష్టి పెట్టని అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని పరిశ్రమలు కనీస నిబంధనలు పాటించడం లేదు. అగ్నిమాపక శాఖను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రమాదం జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై సిబ్బందికి కనీస అవగాహన, శిక్షణ కల్పించడం లేదు. మే నెలలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ఇవే తప్పిదాలు జరిగాయి. తాజాగా పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కంపెనీ ప్రమాదంలోను ఇవే లోపాలు బయటపడ్డాయి. ప్రమాదకరమైన రసాయన పరిశ్రమల్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సిబ్బందిని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి తప్పనిసరిగా ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో ఉండాలి.
ఆ రోజు పాలిమర్స్లో స్టైరిన్ వాయువు వెలువడినపుడు ఆక్సిజన్ అందక 15 మంది చనిపోయారు. సాయినార్లో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెలువడి ఆ గాఢతకు ఇద్దరు మరణించారు. వారికి వెంటనే ఆక్సిజన్ అందించినట్టయితే ప్రాణాలతో బయటపడేవారు. ఇలాంటి రసాయన పరిశ్రమల్లో తప్పనిసరిగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆక్సిజన్ చాంబర్లు అందుబాటులో ఉంచాలి. కానీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. తనిఖీలకు వెళ్లే అధికారులూ ఆ విషయాలను పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
అగ్నిమాపక శకటం తిరిగే మార్గమే లేదు
పరవాడలో రాంకీ ఫార్మాసిటీని 2,200 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఇటీవల కాలంలోనే ఏర్పాటైనది కాబట్టి అన్ని రకాల వసతులు, ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో కంపెనీలకు ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. వాటిలో నిర్మాణాలు జరిగాయి. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం నేరుగా కంపెనీలోకి వెళ్లే అవకాశం ఉండాలి. ఆ విధంగా అంతర్గత రహదారులు నిర్మించాలి. అవి కూడా సక్రమంగా లేవని సాయినార్ ప్రమాదం తరువాత బయటపడింది.
ప్రమాదం జరిగిందని తెలిసి అగ్నిమాపక వాహనం అక్కడకు వెళ్లింది. లోపలికి వెళితే తిరిగే వచ్చే అవకాశం లేదని తెలిసి బయట నుంచి సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఎకరాల కంపెనీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక రెండు ఎకరాలు, ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసినకంపెనీల పరిస్థితి ఏ విధంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఫార్మాసిటీ బఫర్ జోన్(గ్రీన్ బెల్ట్ ఏరియా) 500 మీటర్లు కాగా దానిని కూడా కుదించేసి ఆ భూమిని ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాలను ఏ శాఖ కూడా పట్టించుకోవడం లేదు.
గ్యాస్ అలారం సిస్టమ్ లేదు
పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగితే మోగించడానికి అలారం సిస్టమ్ ఉంటుంది. ప్రమాదకరమైన వాయువులు ఊహించని విధంగా వెలువడితే.. వాటిని వాసన గ్రహించి సిబ్బందిని అప్రమత్తం చేసే అలారం వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటిని రసాయన పరిశ్రమలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే విశాఖలోని పలు పరిశ్రమలు వీటిని ఏర్పాటు చేయలేదు. అధికారులు సైతం యాజమాన్యాలపై ఒత్తిడి తేవడం లేదు. ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లోనూ ప్రమాదకరమైన వాయువులు వెలువడి 17 మంది ప్రాణాలు పోగొట్టుకున్నందున ఈ అలారం సిస్టమ్స్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అన్ని కంపెనీలను ఆడిట్ చేయాలి.. పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ
విశాఖలో ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల సంఖ్య, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే అన్ని కంపెనీల్లో భద్రతాపరమైన ఆడిట్ నిర్వహించాలి. ఆ వివరాలు ప్రకటించాలి. అన్ని శాఖల అధికారులు కలిసి ప్రమాదాలు జరగకుండా నివారించాలి. ఫార్మాసిటీలో అంతర్గత రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి.