సాగు ఎట్‌ 9.51 లక్షల ఎకరాలు

ABN , First Publish Date - 2021-10-04T05:47:48+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ గురువారంతో ముగిసింది. వర్షపాతం కూడా సాధారణం కన్నా 32.78 శాతం అధికంగా నమోదైంది.

సాగు ఎట్‌   9.51 లక్షల ఎకరాలు
నరసరావుపేట ప్రాంతంలో వరి చేను

11 శాతం తగ్గిన విస్తీర్ణం

సమృద్ధిగా సాగు నీటి సరఫరా

ముమ్మరంగా వ్యవసాయ పనులు


నరసరావుపేట, అక్టోబరు 3: ఖరీఫ్‌ సీజన్‌ గురువారంతో ముగిసింది.  వర్షపాతం కూడా సాధారణం కన్నా 32.78 శాతం అధికంగా నమోదైంది. సమృద్ధిగా వర్షాలతో కాలువలకు పుష్కలంగా నీటి సరఫరా జరుగుతున్నది. గురువారంతో ఖరీఫ్‌ ముగియగా శుక్రవారం నుంచి రబీ సీజన్‌ ప్రారంభమైంది. రబీలో కూడా ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఖరీఫ్‌లో 9.51 లక్షల ఎకరాలలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా. వరి సాగు అధికంగా ఉంది. సాధారణ సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 78 శాతం పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇది గత ఏడాది కంటే 11 శాతం తగ్గింది. సాగర్‌ ఆయకుట్టులో వరి సాగు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగర్‌ కాలువకు పూర్తి స్ధాయిలో నీటి సరఫరా జరుగుతున్నది. సాగర్‌ ఆయకట్టులో వరి సాగు ఈ నెలాఖరు వరకు కొనసాగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జిల్లాలో పంటల సాగు లక్ష్యం 13,00,535 ఎకరాలు. సాధారణ విస్తీర్ణం 12,21,535 ఎకరాలు. ఖరీఫ్‌లో 9,51,045 ఎకరాలలో పంటల సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పత్తి సాగు దాదాపు పూర్తైంది. పత్తి పూత, కాయ దశలో ఉంది. పత్తి పంట ఆశాజనకంగా ఉంది.  కృష్ణా డెల్టాలో వరి సాగు పూర్తవ్వగా సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో కొనసాగుతున్నది. సాగు నీరు విడుదల సమృద్ధిగా ఉండటంతో సాగర్‌ కుడి కాలువ ఆయకట్టులో వరి సాగు ఊపందుకుంది. అపరాలు సాగు 39, పత్తి 40 శాతం తగ్గింది. గత ఏడాది పత్తి 3,85,522 ఎకరాలలో వేశారు. గత ఏడాది కన్నా 1,32,927 ఎకరాలలో పత్తి సాగు తగ్గింది. దీనికి కారణం గులాబీ తెగులు ప్రభావం అని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  


Updated Date - 2021-10-04T05:47:48+05:30 IST