అసంపూర్తిగా సా..గుతున్న నిర్మాణ పనులు
ABN , First Publish Date - 2021-12-27T04:49:06+05:30 IST
ఎంతో ఆర్భాటంగా.. అట్టహాసంగా ప్రారంభించారు. ఆపై చేతులెత్తేశారు..! ఇదీ మండలంలో ప్రభుత్వ భనవ నిర్మాణాల దుస్థితి.
సచివాలయ, ఆర్బీకే, హెల్త్ వెల్నెస్ భవనాలు పూర్తయ్యేదెన్నడో..?
పొదలకూరు, డిసెంబరు 26 : ఎంతో ఆర్భాటంగా.. అట్టహాసంగా ప్రారంభించారు. ఆపై చేతులెత్తేశారు..! ఇదీ మండలంలో ప్రభుత్వ భనవ నిర్మాణాల దుస్థితి. గ్రామ సచివాలయ, రైతు భరోసా, హెల్త్ వెల్నెస్ భవన నిర్మాణ పనులు రెండేళ్లుగా సా...గుతూనే ఉన్నాయి. మండలంలోని 30 గ్రామ పంచాయతీలకుగాను 23 సచివాలయాలకు శాశ్వత భవన నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే రైతుభరోసా, హెల్త్ వెల్నెస్ కేంద్రాలకు కూడా నూతనంగా భవన నిర్మాణ పనులను ప్రారంభించింది. ఒక్కో గ్రామ సచివాలయం నిర్మాణానికి రూ.40 లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.21.8లక్షలు, ఆరోగ్య కేంద్రానికి రూ.17.5లక్షల చొప్పున నిధులు కేటాయించింది. కాగా పొదలకూరు బిట్-1, కనుపర్తి, తోడేరు, మరుపూరు సచివాలయాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పంచాయతీల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే రైతు భరోసా కేంద్రాలు కేవలం మొగళ్లూరు, కనుపర్తి, తోడేరు, ఆర్వైపాలెం గ్రామాల్లో మాత్రమే పూర్తి చేశారు. మిగిలినచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెల్త్ వెల్నెస్ కేంద్రాలు మొగళ్లూరు, పొదలకూరు బిట్-4, మరుపూరు గ్రామాల్లో తప్ప మిగిలిన గ్రామాల్లో నిర్మాణ పనులు ఆగి ఉన్నాయి. ఈ పనులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. దుగ్గుంట, సూరాయపాలెం గ్రామాల్లో అసలు నిర్మాణాలు జరగలేదు. శాశ్వత భవనాలు లేకపోవడంతో గ్రామ సచివాలయాలు ఇరుకు గదుల్లోనే నడుస్తున్నాయి. దీంతో సామగ్రిని భద్రపరచలేక సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రభుత్వం నిధులను మంజూరు చేసి సత్వరమే భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలో నిర్మాణాలు పూర్తి చేస్తాం
మండలంలోని 23 సచివాలయాల పరిధిలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాలుగు గ్రామ సచివాలయాల నిర్మాణ పనులు పూర్తై ప్రారంభించడం జరిగింది. మిగతా భవనాలకు సంబంధించి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో పనులు ఆగాయి. మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తాం.
- ప్రసాద్, ఏఈ, పంచాయతీరాజ్, పొదలకూరు