సాగునీటి కోసం రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-29T03:26:53+05:30 IST
మండల పరిధిలోని తుమ్మలతలుపూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు మంగళవారం సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు
సైదాపురం, జూన్ 28: మండల పరిధిలోని తుమ్మలతలుపూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు మంగళవారం సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. చేపలు పట్టేందుకు చెరువులో నీటిని వదులుతున్నారని, దీంతో పశువులకు తాగునీరు ఇబ్బంది కలుగుతుందని అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి చెరువు నీరు వదలకుండా అధికారులు తూమును లాక్ చేశారు. ఈనెల 26వ తేదీన చెరువు నుంచి పొలాల దుక్కుల కోసం నీరు వదలమని రైతులు అధికారులను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో రైతులు గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ ఏఈ నిరంజన్, ఎంపీడీవో కార్యాలయం ఏవో శివకుమార్లు గ్రామానికి చేరుకుని చెరువును పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాగునీటి కోసం చెరువు తూము తెరిచేందుకు పంచాయతీ తీర్మానం చేశారు. దీంతో రైతులు హర్షం వ్మక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచు ఆవుల హరిత, ఎంపీటీసీ శేషమ్మ, టీడీపీ మండల నాయకులు పెమ్మసాని ఆనంద్ నాయుడు, పెమ్మసాని దిలీప్చౌదరి తదితరులు పాల్గొన్నారు.