న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టోత్సవం

ABN , First Publish Date - 2021-05-10T02:24:16+05:30 IST

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టోత్సవం

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టోత్సవం

ఎడిసన్: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి నాంది పడింది. న్యూజెర్సీలో హిందూ ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా - శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ హేరంబ గణపతి, పంచముఖ శివ, కామాక్షీ అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, మురుగన్, హనుమాన్, అయ్యప్పస్వామి, నవగ్రహ దేవత సహిత ఉత్సవ దేవతా మూర్తి, వాసవీ కన్యకాపరమేశ్వరీ, షిరిడీ సాయిబాబా మరియు దత్త పరంపర సన్నిధి సహితంగా, న్యూ జెర్సీ రాష్ట్ర నడిబొడ్డు ఎడిసన్ నగరంలోని ఓక్ ట్రీ రోడ్‌లో శ్రీ శివ విష్ణు ఆలయం ఆవిర్భవించింది. ఈ ఆలయ ప్రారంభం ఆగమ శాస్త్రోక్తయుక్తంగా, అంగ రంగ వైభవంగా జరిగింది. న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ విష్ణు ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.



కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. ఈ ప్రాణ ప్రతిష్టోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించేలా సాయి దత్త పీఠం ఏర్పాట్లు చేసింది. సౌత్ ప్లైన్ ఫీల్డ్ లో తాత్కాలిక ఆవాసంలో ఉన్న సాయి దత్త పీఠం ఇప్పుడు భక్తులకు మరింత చేరువయ్యేందుకు ఎడిసన్‌లో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరాన్ని నిర్మించింది. ఇక  ప్రధాన సేవలన్నీ ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం నుంచే జరగనున్నాయి. న్యూజెర్సీలో హిందూ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సాయి దత్త పీఠం.. శ్రీ శివ విష్ణు మందిరాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దింది. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ దేవతల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రఘుశర్మ, భైరవ మూర్తి, మురళీ కృష్ణ శర్మ, మహంకాళీ రామకృష్ణ, సూరి కృష్ణ శర్మతో పాటు, సాయి దత్త పీఠం పురోహితులు.. కరోనా మహమ్మారి త్వరగా తొలగిపోయి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం జరిగిన హోమాది కార్యక్రమాలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. గత 7 రోజులుగా జరుగుతున్న ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం రోజు శివ పార్వతుల కళ్యాణం జరిగింది. ఈ క్రమంలో దేవాలయ ప్రాంగణం భక్తులతో కళ కళ లాడింది. వేంకటేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరీ, మురుగన్, దత్త పరంపర విగ్రహాలు ఇంకా షిప్మెంట్‌లోనే ఉన్నట్టు తెలిపారు. ఈ విగ్రహాల ప్రతిష్టాపన జూన్ నెలలో జరుగుతుందని రఘు శర్మ తెలియచేసారు.



తానా అధ్యక్షుడు జె తాళ్లూరి, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్, ఎక్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి, టి పి రావ్, టీఎఫ్ఏఎస్ అధ్యక్షులు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ గనగోని, సుధాకర్ ఉప్పల, ఆలయ ప్లాటినమ్ స్పాన్సర్, సంఘ సేవకులు జగదీష్ యలమంచిలి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఓం సాయి బాలాజీ వ్యవస్థాపకులు మద్దుల సూర్యనారాయణ, పోమోనో రంగనాథ ఆలయ ప్రతినిధులు, గురువాయూరప్పన్ ఆలయ ప్రతినిధులు విచ్చేసి మందిర నిర్మాణం‌పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని ఉష.. తన గాన మాధుర్యం భక్తులను ఓలలాడించారు. చివరగా రఘుశర్మ మాట్లాడుతూ.. మందిర నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారికి కార్యక్రమం విజయవంతం కావడంలో కృషి చేసిన వారికి ప్రత్యకంగా అభినందనలు తెలిపారు.




Updated Date - 2021-05-10T02:24:16+05:30 IST