పదేళ్ల నేర చరిత్ర ఉన్న చైన్స్నాచర్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-05T11:55:20+05:30 IST
చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్ మలక్పేట్, వాహెద్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అస్లాం(30) చైన్ స్నాచింగ్లు చేయడంలో సిద్ధ హస్తుడు. బైకులు తస్కరించడం అతడి నైజం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ సీపీ రమేశ్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అస్లాం గత నెల 19న సంతోష్నగర్ పీఎస్ పరిధిలో ఓ యాక్టివా ద్విచక్రవాహనాన్ని తస్కరించాడు. వాహనం గుర్తు పట్టకుండా ఉండేందుకు పచ్చరంగు యాక్టివాపై స్ర్పే చేసి నలుపురంగుగా మార్చాడు. గత నెల 21న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఓ షాపు వద్ద వాహనాన్ని ఆపి షాపులో ఉన్న యువతి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయాడు.
ఆ తర్వాత బంగారాన్ని ఓ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి రూ.50వేలు తీసుకుని ముంబై పారిపోయాడు. ముంబై నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ బైకుపై తిరుగుతూ తాజాగా ఈ నెల 2న సైదాబాద్ పీఎస్ పరిధిలోని కేశవ్నగర్లో ఓ చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఎల్బీనగర్తో పాటు సైదాబాద్ పీఎస్ పరిధుల్లో చైన్ స్నాచింగ్లు, సంతోష్నగర్ పీఎస్ పరిధిలో బైక్ చోరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించిన పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు (6.5తులాలు), ఓ యాక్టివా ద్విచక్రవాహనం, ఓ డాగర్, ఓ సెల్ఫోన్... స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ రూ. 3.5లక్షలు ఉంటుందని సీపీ వెల్లడించారు.
నేర చరిత్ర
సంగారెడ్డి జిల్లాలో కొంతమంది రౌడీలతో సహవాసం చేసే అస్లాంపై అక్కడా కేసులు నమోదై ఉన్నాయి. ఓ హత్యాయత్నం కేసుతో పాటు అల్లర్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకుని కొన్ని రోజుల పాటు వెల్డర్గా పని చేశాడు. ఆ తర్వాత కొంతమంది నేరస్థులతో స్నేహం చేసి నేరాల బాట పట్టాడు. గత పదేళ్లలో 40కి పైగా నేరాల్లో నిందితుడిగా ఉన్న అస్లాం అధికంగా మూడు కమిషనరేట్ల పరిధుల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు.
పలుమార్లు అరెస్టు అయిన అతడిపై 2015-16లో కంచన్బాగ్ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. 2018లో సైదాబాద్ పీఎస్ పరిధిలో ఓ వృద్ధురాలి చైన్ స్నాచింగ్ చేసి చిక్కిన తర్వాత మరోసారి పీడీయాక్ట్ పెట్టారు. అన్ని కేసుల్లో అరెస్టు అయి రిమాండ్, జైలు శిక్షలు అనుభవించిన తర్వాత గతేడాది సెప్టెంబర్లో విడుదలయ్యాడు. అనంతరం జహీరాబాద్లో ఓ భూవివాదంలో పాల్గొన్న అస్లాం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిపై అక్కడి చిరాగ్పల్లి పీఎస్లో కేసు నమోదై ఉంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అస్లాంను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సైదాబాద్ పోలీసులను సీపీ అభినందించారు.