సజ్జకు మద్దతు ధర దక్కేనా..!?

ABN , First Publish Date - 2021-11-15T03:58:53+05:30 IST

రైతుల నివాసాల్లో సజ్జ పంట నిల్వలు మగ్గుతున్నాయి. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

సజ్జకు మద్దతు ధర దక్కేనా..!?
రైతుల ఇళ్లలో నిల్వ ఉన్న సజ్జలు

నివాసాల్లో మగ్గుతున్న నిల్వలు

దళారులకు విక్రయిస్తే క్విటాకు రూ.850 నష్టం

కొనుగోలు కేంద్రం కోసం ఆందోళన

పట్టించుకోని అధికారులు, పాలకులు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 14 : రైతుల నివాసాల్లో సజ్జ పంట నిల్వలు మగ్గుతున్నాయి. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పంట దిగుబడులు నివాసాలకు చేరి నెల రోజులు దాటినా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. సజ్జ కొనుగోలు కేంద్రం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో కొన్నిరోజులుగా ఆందోళనలు, కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. గతం కంటే ఈసారి సాగు వ్యయం పెరగడంతో వ్యాపారులు అడిగే ధరకు విక్రయిస్తే నష్టాల పాలవుతామని రైతులు అంటుండగా, మరి కొంతమంది రైతులు పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో తక్కువ ధరకు దళారులకు తెగనముమకుంటున్నారు. 

పెరిగిన సాగు వ్యయం 

ఉదయగిరి సబ్‌ డివిజన్‌లో గత ఖరీఫ్‌ సీజన్‌లో 480 హెక్టార్లలో సజ్జ పంట సాగు చేశారు. విత్తు నుంచి కోత వరకు గతేడాది కంటే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని రైతులు అంటున్నారు. ఎకరానికి దుక్కికి రూ.3వేలు, విత్తనాలు, నాట్లు రూ.3వేలు, ఎరువులు, పురుగు మందులు రూ.2వేలు, నూర్పిడి యంత్రానికి రూ.4వేలు ఇలా ప్రతి ఖర్చూ గతంలో పోలిస్తే పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా దిగుబడులను ఇంట్లో నిల్వ చేసుకొని వాటిని సంరక్షించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటం రూ.2,250 ఉండగా దళారులు రూ.1300, రూ.1400 చొప్పున కొనుగోలు చేస్తుండడంతో క్వింటాకు రూ.850 రైతులు నష్టపోతున్నారు. కొంతమంది రైతులు పెట్టుబడి కోసం తెచ్చిన నగదు చెల్లించేందుకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-15T03:58:53+05:30 IST