జీతం పెరిగాక కొలువుకు టాటా
ABN , First Publish Date - 2022-06-21T09:14:28+05:30 IST
ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ నుంచి జీతం పెరిగాక మానేద్దామని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో నలుగురు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది.
ప్రతి 10 మంది ఉద్యోగుల్లో
నలుగురి అభిప్రాయమిదే..
నమన్ హెచ్ఆర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ నుంచి జీతం పెరిగాక మానేద్దామని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో నలుగురు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా, పురుషుల్లో ఈ వాటా అధికంగా ఉందని, ప్రతి 10 మందిలో ఆరుగురు ఇదే అభిమతాన్ని కలిగి ఉన్నారని తెలిపింది. జాబ్ మార్కెట్లో ఉద్యోగుల వలసలకు కారణమవుతున్న అంశాలను అవగతం చేసుకునేందుకు పలు రంగాలకు చెందిన 500కు పైగా కంపెనీల సిబ్బందిని సర్వే చేసినట్లు మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నమన్ హెచ్ఆర్ తెలిపింది.
ఉద్యోగం వదిలేయాలన్న నిర్ణయానికి రావడానికి ఆశించిన స్థాయి లో జీతం పెరగకపోవడం ప్రధాన కారణమవుతోందని నమన్ హెచ్ఆర్ వ్యవస్థాపకులు సమీర్ పరీఖ్ అన్నారు. ఉద్యోగులను నిలుపుకునేందుకు కంపెనీలు వెసులుబాటుతో కూడిన పనిగంటలు, వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యాన్ని కల్పించడంతో పాటు సముచిత స్థాయిలో, క్రమంగా జీతం పెంపు, ప్రతిభకు గుర్తింపు, మెరుగైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలందించడంపై దృష్టిసారించాలన్నారు.
సొంత వ్యాపారం ప్రారంభిస్తాం:
ప్రతి పది మందిలో ఒకరికి పైగా సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ప్రస్తుత ఉద్యోగాన్ని వీడాలనుకుంటున్నట్లు సర్వే నివేదిక తెలిపింది. 35-40 ఏళ్ల మధ్యనున్న సిబ్బందిలో ఈ దిశగా ఆలోచిస్తున్నవారి వాటా 35 శాతంగా ఉంది. 20-29 ఏళ్ల ఉద్యోగుల్లో ఈ వాటా 44 శాతంగా ఉన్నప్పటికీ, ఇప్పుట్లో ఉద్యోగం వీడే ఆలోచన లేదన్నారు. అధికంగా మాన్యుఫాక్చరింగ్, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు సొంత వ్యాపార యోచనలో ఉన్నారని రిపోర్టు పేర్కొంది.
ఉద్యోగం వీడటానికి కారణాలు (%)
నత్తనడకన వేతన వృద్ధి 54.8
వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యత లోపించడం 41.4
కెరీర్లో వృద్ధి అవకాశాలు లేకపోవడం 33.3
సరైన గుర్తింపు లభించకపోవడం 28.1
ఏయే రంగాల్లో ఎంత మంది (%)
సేవలు 37
తయారీ 31
ఐటీ 27