తాజా.. మాజీ.. వీసీల అరెస్టు!
ABN , First Publish Date - 2022-05-19T08:29:40+05:30 IST
ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. విద్యార్థులకు ఉన్నత విద్యనందించి, భవిష్యత్తుకు బాటలు వేసే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా ఉన్నారు. అంతటి కీలక స్థానాల్లో ఉన్నా..
- కాసుల కక్కుర్తితో సర్టిఫికెట్ల విక్రయం
- భోపాల్లోని ఎస్ఆర్కేయూ
- ఉపకులపతుల నిర్వాకం
- రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- వీసీలు అరెస్టు కావడం ఇదే తొలిసారి
- నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లిన
- వారినీ వదలం.. అదనపు సీపీ శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. విద్యార్థులకు ఉన్నత విద్యనందించి, భవిష్యత్తుకు బాటలు వేసే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా ఉన్నారు. అంతటి కీలక స్థానాల్లో ఉన్నా.. కాసులకు కక్కుర్తి పడ్డారు. డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చేశారు! ఇదీ ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీల బాగోతం! ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్టిఫికెట్ల తీగ లాగిన పోలీసులు.. మూడు నెలలుగా చేసిన దర్యాప్తులో ఎన్నో విషయాలు గుర్తించారు. అన్నీ తామై, సంతకాలు చేసి మరీ సర్టిఫికెట్లు అమ్ముకున్న ఇద్దరు వీసీలను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. నగర అదనపు సీపీ (క్రైం, సిట్) ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై అప్పట్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి తీగ లాగితే డొంక కదిలింది. అప్పట్లోనే సాయి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మొత్తం ఏడుగురు ఏజెంట్లను అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ విద్యార్థులు 15 మందితో సహా మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. 12 మంది తల్లిదండ్రులు కూడా అరెస్టు అయ్యారు. సర్టిఫికెట్ల కుంభకోణంలో కీలకంగా ఉన్న భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి పరీక్షలు రాయకుండానే విద్యార్థులు సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ప్రొవిజనల్స్, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో వీసీలతో పాటు యూనివర్సిటీలోని కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందన్నారు. అదేవిధంగా యూపీలోని గ్లోకల్ వర్సిటీ, సాగర్లోని ఎస్వీ వర్సిటీ, మదురైలోని కామరాజ్, మద్రాస్ యూనివర్సిటీలు సైతం ఇలాంటి దందాకు పాల్పడ్డాయని వెల్లడించారు. విచారణలో భాగంగా సిట్కు చెందిన 7 బృం దాలు 3 నెలలు మధ్యప్రదేశ్లో మకాం వేసి వర్సిటీల బాగోతాన్ని బయటకు తీశాయని తెలిపారు. ఎస్ఆర్కేయూ 101 సర్టిఫికెట్లు జారీ చేయ గా.. విద్యార్థుల నుంచి 44 సర్టిఫికెట్లను సీజ్ చేశామన్నారు. వాటిలో 13 బీటెక్, బీఈ; 31 ఇతర డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. గ్లోకల్ వర్సిటీకి సంబంధించిన 4, సాగర్లోని ఎస్వీ వర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మదురై కామరాజ్, మద్రాస్ వర్సిటీలపై దర్యాప్తు సాగుతోందని శ్రీనివాస్ చెప్పారు. ఇద్దరు వీసీలు అరెస్టవడం ఇదే తొలిసారన్నారు.
ఈ మొత్తం బాగోతంలో సూత్రధారి (కింగ్పిన్)గా ఉన్న ఎస్ఆర్కేయూ ఇన్చార్జి వీసీ సునీల్కపూర్(52) ముందస్తు బెయిల్ తీసుకుని తప్పించుకున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. కేతన్ సింగ్ అనే మరో ఉద్యోగి గతంలోనే అరెస్టయ్యాడన్నారు. ప్రస్తుత వీసీ ఎం.ప్రశాంత్ పిళ్లైతో పాటు 2017 నుంచి 2021 వరకు వీసీగా ఉన్న ఎస్ఎస్ కుష్వత్లను అరెస్టు చేశామని చెప్పారు. డబ్బుకు కక్కుర్తి పడి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నిందితులు అంగీకరించారని.. పూర్తి ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా అరెస్టులు ఉంటాయని తెలిపారు. అడ్డదారిలో సర్టిఫికెట్లు పొందిన కొందరు విదేశాలకు వెళ్లారని.. వారిపైనా చర్యలు ఉంటాయని అన్నారు.