రూ. కోటి పైబడిన అపార్ట్మెంట్లకు భలే గిరాకీ
ABN , First Publish Date - 2022-04-09T09:34:51+05:30 IST
మహమ్మారి నేపథ్యంలో పెద్ద ఇళ్లకు డిమాండు బాగా పెరిగింది.
న్యూఢిల్లీ: మహమ్మారి నేపథ్యంలో పెద్ద ఇళ్లకు డిమాండు బాగా పెరిగింది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో కోటి రూపాయల పైబడిన ధరల్లోని అపార్ట్మెంట్ల అమ్మకాలు జోరు గా సాగాయి. ఏడు ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్లు 83 శాతం వృద్ధితో 10,988 అమ్ముడుపోయాయని జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5994 ఉన్నాయి. ఆ నగరాల్లో హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, పూణె, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఎన్సీఆర్ ఉన్నాయి. రూ.1-1.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు 6,187 అమ్ముడుపోగా రూ.1.5 కోట్లు పైబడిన విలువ గల ఫ్లాట్లు 4,801 అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫ్లాట్లు కలిపి దేశంలో మొత్తం అమ్మకాలు 51,849 ఉన్నాయి.