జోగినిపల్లిని వరించిన “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డ్”

ABN , First Publish Date - 2022-06-30T21:57:48+05:30 IST

తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్

జోగినిపల్లిని వరించిన “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డ్”

Hyderabad: తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరులోని  వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా నేషనల్ గ్రీన్ అవార్డును సంతోష్ కుమార్ అందుకున్నారు.


“సాలుమారద తిమ్మక్క ఇంటర్‌నేషనల్ ఫౌండేషన్”, “శ్రీ సిద్ధార్ధ ఎడ్యుకేషనల్ సొసైటీ”, కర్ణాటక సంయుక్తంగా 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ సామాజిక సేవకులకు అందించే ఈ అవార్డును ప్రకృతి పరిరక్షణ విభాగంలో సంతోష్ కుమార్ అందుకున్నారు. 


ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి సేవకురాలు, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలోని కమిటీ నన్ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”కు ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్ రావు నడిచిన బాటను అనుసరిస్తూ.. నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఐదేళ్ల క్రితం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఒకరు మరొక మిత్రున్నో లేక కుటుంబ సభ్యున్నో మొక్కలు నాటేలా ప్రోత్సహించాలనే చిన్న ప్రయత్నంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ఈ రోజు ఖండాలు దాటడం నా ఘనతగా భావించడం లేదు. ఈ నేల భవిష్యత్ తరాలకు అందకుండా పోతుందేమోనని స్పందించే ప్రతీ హృదయానికి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”‌లో మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా’’ అని చెప్పారు. 


ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

నేషనల్ గ్రీన్ అవార్డు అందుకోవడం తనకు మరింత బాధ్యతను పెంచిందని జోగినిపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. తనతోపాటు అవార్డు అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ పద్మశ్రీ ఎ.ఎస్ కిరణ్ కుమార్‌కు, ప్రముఖ నిర్మాత రంగనాథ్ భరద్వాజ్‌కు, ప్రముఖ విద్యావేత్త, రచయిత గురురాజా కరజ్జయినికి, సత్యామోర్గాని శుభాకాంక్షలు తెలిపారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి గంగాధరయ్య పరమేశ్వరతో పాటు సిద్ధార్థమఠం పీఠాధిపతి హొరనహళ్లి సద్గురు శంకరానంద మహాస్వామి, ఇతర పీఠాధిపతులు, సాలుమారద తిమ్మక్క ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





Updated Date - 2022-06-30T21:57:48+05:30 IST