తొలి రెండు విడతల్లోనే మా పార్టీ సెంచరీ కొట్టేసింది: అఖిలేశ్ యాదవ్
ABN , First Publish Date - 2022-02-17T23:56:25+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని సమాజ్వాదీ..
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తొలి రెండు విడతల ఎన్నికల్లోనే తామే ‘సెంచరీ’ కొట్టేశామని, మిగతా విడతల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు తమ సొంతమవుతాయని పేర్కొన్నారు. తొలి రెండు విడతల్లో రాష్ట్రంలోని 133 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న మూడో విడత, 23న నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి.
తొలి రెండు విడతల్లోనే తాము సెంచరీ మార్కును చేరుకున్నామని, నాలుగో విడత నాటికి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలను గెలుచుకుంటామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఫిరోజాబాద్లోని నసీర్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఫిరోజాబాద్ ప్రజలు బీజేపీకి కళ్లు తెరిపిస్తారని అన్నారు. ఇక్కడ కూడా థర్డ్ ఫేజ్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎస్పీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కుల గణన చేపడతామని అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎస్పీ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవిస్తుందని నొక్కి చెప్పారు.