Sanath Nagar: యూట్యూబ్లో వీడియో చూసి...పక్కింటి ధనం కోసం క్షుద్రపూజలు
ABN , First Publish Date - 2021-11-14T17:06:20+05:30 IST
క్షుద్రపూజల ద్వారా పక్కింట్లోని ధనం మనకు వస్తుందనే వీడియోను యూట్యూబ్లో చూశారు. ఆ పూజలు చేసే పూజారిని నగరానికి తీసుకొచ్చారు.
పూజారికి వేధింపులు..ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్/సనత్నగర్ : క్షుద్రపూజల ద్వారా పక్కింట్లోని ధనం మనకు వస్తుందనే వీడియోను యూట్యూబ్లో చూశారు. ఆ పూజలు చేసే పూజారిని నగరానికి తీసుకొచ్చారు. రూ. 3 లక్షలు ఖర్చు చేసి అతడితో పూజలు చేయించారు. వీడియో చూపించినట్లు డబ్బు రాకపోవడంతో తప్పు పూజారి మీదకు నెట్టారు. ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని అతడిని బెదిరింపులకు గురి చేశారు. అతడి ఫిర్యాదుతో సనత్నగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
సీఐ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాలకు చెందిన ఫయాజ్ జగద్గిరిగుట్టలో నివాసముంటున్నాడు. ఇతనికి మెదక్లో ఉంటున్న సురేష్, ఖైరతాబాద్కు చెందిన వెంకటలక్ష్మి నరసింహారావు, కుర్నూలుకు చెందిన శ్రీనివాస్, గుంటురుకు చెందిన సాంబయ్య, కర్నాటకకు చెందిన రాహుల్ స్నేహితులు. అందరూ జగద్గిరిగుట్టలోనే నివాసముంటున్నారు. ఫయాజ్ కొద్దిరోజుల క్రితం యూట్యూబ్లో క్షుద్రపూజల వీడియో చూశాడు. అందులో పక్కింట్లో ఉన్న ధనం మనకు సొంతమయ్యేందుకు పూజలు చేయవచ్చని ఓ పూజారి పేర్కొన్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఆ పూజారి పురుషోత్తంచారిని అక్టోబర్ 22న ఫయాజ్, అతని మిత్రులు నగరానికి తీసుకువచ్చి, మూసాపేటలోని ఓ లాడ్జి గదిలో ఉంచారు. క్షుద్రపూజల ద్వారా పక్కింటి ధనం తమకు వస్తే అందులో అతడికి కొంత ఇస్తామని చెప్పి పూజలు ప్రారంభించారు.
ఇళ్లను అద్దెకు తీసుకుని..
పూజల కోసం ఫయాజ్ అతని మిత్రులు కూకట్పల్లిలోని ఓ ఇంటిని, కుత్బుల్లాపూర్లోని మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. క్షుద్రపూజలు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో పురుషోత్తమచారిని ఒత్తిడికి గురిచేయడం ప్రారంభించారు. దాదాపు రూ. 3 లక్షలకుపైగా ఖర్చు చేసిన వారు ఆ మొత్తాన్ని పూజారి నుంచే వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎయిర్గన్, పిస్టల్తో బెదిరింపులు
తమ వద్ద ఉన్న ఎయిన్గన్, ఎయిర్ పిస్టల్ చూపించి పురుషోత్తంచారిని బెదిరింపులకు గురిచేశారు. అతడి బంధువులకు ఫోన్ చేసి దాదాపు రూ. 85 వేలను వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. కొద్ది రోజులక్రితం చారిని వదిలిపెట్టారు. మిగిలిన డబ్బు కోసం చారిని ఫోన్లో వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో పురుషోత్తంచారి నాలుగురోజుల క్రితం సనత్నగర్ పోలీస్టేషన్కు చేరుకొని జరిగిన ఉదంతాన్ని వివరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్తో పాటు అతని మిత్రులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎయిర్గన్, ఎయిర్ పిస్టల్, రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు, ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.