ఇసుక కోసం.....బండెడు కష్టాలు
ABN , First Publish Date - 2020-11-26T05:39:11+05:30 IST
ఇసుక కావాలంటే బండెడుకష్టం తప్పేలా లేదు.
ఇసుక కావాలంటే బండెడుకష్టం తప్పేలా లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకొచ్చిన కొత్తకొత్త పాలసీలతో ఇసుక బంగారంలా మారిపోయింది. దీంతో చాలా చోట్ల రకరకాల అభివృద్ధిపనులు ఆగిపోయాయి. భవననిర్మాణాలూ ఆగిపోయాయి. ప్రభుత్వం ఎడ్లబండిలో రీచ్ల నుంచి ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని చెప్పడంతో కొందరు ఆదిశగా చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వర్రెడ్డినగర్ సమీపంలో పెన్నానది నుంచి ఒంటెద్దుబండి యజమానులు తమ అవసరాల కోసం ఇసుకను తెచ్చుకుంటున్న తీరు చూస్తే జాలి కలుగుతుంది. నడుములోతు నీళ్లలో నదిలోకి వెళ్లి ఇసుక తోడి తెచ్చుకుంటున్నారు. నీళ్లలో ఇసుకతో నిండిన బండిని లాగలేక ఎద్దులు, వాటి యజమానులు సైతం అవస్థలు పడుతున్నారు. కొందరు ఇసుక తరలించడం ద్వారా వచ్చే అరకొర సంపాదనతో బతుకుబండి లాగిస్తున్నారు. ప్రస్తుతం తుపాను హెచ్చరికలతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
- ప్రొద్దుటూరు రూరల్