పర్మిట్ల మాయాజాలం!

ABN , First Publish Date - 2021-02-26T05:20:53+05:30 IST

ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రవేశపెట్టినా.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక తవ్వకాల అనుమతి కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మాఫియా ఒడిశాలో అనుమతుల పేరిట.. ఇసుక రవాణా సాగిస్తోంది. ఒడిశా సరిహద్దుల గ్రామాల మీదుగా విశాఖకు అడ్డదారిలో ఇసుక తరలిస్తోంది. ఫర్మిట్ల మాయాజాలంతో రూ.కోట్లు గడిస్తూ.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోంది.

పర్మిట్ల మాయాజాలం!
భామిని మండలం నేరేడు గ్రామం నుంచి విశాఖ తరలిస్తున్న ఇసుక లారీ

- ఇసుక అక్రమార్కుల కొత్త ఎత్తులు

- ఒడిశాలో తవ్వకాలు.. ఆంధ్రాకు అక్రమ రవాణా

- మాఫియాపై తనిఖీ అధికారుల ఉదాసీనత

- ప్రభుత్వ ఖజానాకు గండి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రవేశపెట్టినా.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక తవ్వకాల అనుమతి కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మాఫియా ఒడిశాలో అనుమతుల పేరిట.. ఇసుక రవాణా సాగిస్తోంది. ఒడిశా సరిహద్దుల గ్రామాల మీదుగా విశాఖకు అడ్డదారిలో ఇసుక తరలిస్తోంది. ఫర్మిట్ల మాయాజాలంతో రూ.కోట్లు గడిస్తూ..  ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఒడిశా సరిహద్దు గ్రామాల మీదుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతిరోజూ రాత్రి వేళ పదుల సంఖ్యలో ఇసుక లారీలు విశాఖపట్నం తరలిపోతున్నాయి. తనిఖీలు నామమాత్రంగానే మారాయి. ప్రధానంగా ప్రతిరోజు భామిని మండలం నేరేడు, కాట్రగడ గ్రామాల నుంచి ఇసుక లారీలు విశాఖ వెళుతున్నాయి. పాలకొండ మండలం అన్నవరం, సరుబుజ్జిలి గ్రామాల పరిధిలోని నాగావళి నదిలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఒడిశా అనుమతి పత్రాలతో  విశాఖపట్నానికి ఇసుక రవాణా చేస్తున్నారు.  రాత్రిపూట హైవే మీదుగా, పాలకొండ నుంచి రాజాం మీదుగా పదుల సంఖ్యలో ఇసుక లారీలు విశాఖకు చేరుతున్నాయి. ప్రతిరోజూ భామిని, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే 50 లారీలకు పైగా ఇసుక నిల్వలు దొడ్డిదారి అనుమతులతో తరలిపోతున్నాయి. 


- విశాఖలో నేతకు సంబంధాలు...


విశాఖపట్నంలో ఒక ఎంపీకి చెందిన నిర్మాణ సంస్థకు ఈ ఇసుకను రవాణా జరుగుతున్నట్లు తెలిసింది. మార్గ మధ్యలో ఎవరైనా ఇసుక లారీలను తనిఖీ చేస్తే, తాము ఒడిశాలో అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తున్నట్టు మాఫియా సభ్యులు అధికారులను నమ్మిస్తున్నారు. తెరవెనుక పాలక పెద్దలు ఉండడంతో మనకెందుకులే అని తనిఖీ అధికారులు, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా దగ్గర మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారు. 


- అనుమతులు ఉన్నాయో? లేవో?


ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, రవాణా కోసం కొత్త పాలసీ అమలు చేస్తోంది. ఇసుక తవ్వకాల అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి పన్ను రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. అంతే కాకుండా ఎంత ఇసుక కావాలంటే అంతకు పర్మిట్లు ఆన్‌లైన్‌లో వచ్చే అవకాశం లేదు. దీంతో  ఇసుక మాఫియాకు ఆన్‌లైన్‌లో అనుమతులు తెచ్చుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో  ఒడిశాలో ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయంటూ మాఫియా మాయమాటలు చెబుతోంది. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తోంది. ఒడిశాలో మాఫియాకు అనుమతులు ఉన్నాయో లేవో కూడా అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఉన్నా ఒడిశా అనుమతులతో ఆంరఽధాలో ఇసుక విక్రయాలు ఎలా సాధ్యమనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం కరువవుతోంది. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-02-26T05:20:53+05:30 IST