పెన్గంగాలో ఇసుక తోడేళ్లు!
ABN , First Publish Date - 2022-05-02T07:00:32+05:30 IST
పెనుగంగా నదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. కాంట్రాక్టర్లు, స్థానిక ఇసుక దొంగలు కలిసి పెన్గంగమ్మను చెరబట్టారు. అందిన కాడికి ఇసుకను తోడేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. అలాగే ఇసుకతో పాటు గంగా ఒడ్ల ను సైతం యంత్రాలతో తవ్వి అక్రమ రవాణా చేస్తు న్నారు.
తాంసి(కె) వద్ద ఇసుకను అక్రమంగా తోడేస్తున్న ఇసుకాసురులు
నది మధ్యలో నుంచి రోడ్డు వేసి మరీ.. రాత్రివేళ టిప్పర్లలో రవాణా
భీంపూర్, మే 1: పెనుగంగా నదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. కాంట్రాక్టర్లు, స్థానిక ఇసుక దొంగలు కలిసి పెన్గంగమ్మను చెరబట్టారు. అందిన కాడికి ఇసుకను తోడేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. అలాగే ఇసుకతో పాటు గంగా ఒడ్ల ను సైతం యంత్రాలతో తవ్వి అక్రమ రవాణా చేస్తు న్నారు. మండలంలోని పిప్పల్కోటి శివారు వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల కోసం బఢా కాంట్రాక్టర్లు తాంసి(కె) ప్రాంతంలోని పెన్గంగాలో భారీ డోజర్లు పెట్టి రోజు టన్నుల కొద్ది ఇసుకను తవ్వేస్తున్నారు. ఇదే అదనుగా ఇసుకను టిప్పర్లతో ఇతరులకు అమ్మేస్తున్నారు. ఇసుక వాహనాల కోసం వీరు నది మధ్యలో నుంచే రోడ్డును ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. అలాగే ఒడ్డున భారీగా ఇసుక డంపులను వేశారు. నది ఒడ్లను తవ్వేస్తూ మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. ఇక స్థానికులైన కొందరు అక్రమార్కులు సైతం ఇసుక డంపులు వేసి రాత్రుల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను ఆదిలాబాద్ సహ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం. గంగనది ఒడ్లను తవ్వడం వల్ల వర్షాకాలం వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
: మహేంద్రనాథ్, తహసీల్దార్, భీంపూర్
పెన్గంగా నదిలో నుంచి అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఏమైనా వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.