ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న సంఘ్పరివార్
ABN , First Publish Date - 2022-05-21T08:05:07+05:30 IST
జ్ఞాన్వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): జ్ఞాన్వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సంఘ్ పరివార్ దేశాన్ని చీకటి దశలోకి నెట్టాలనుకుంటోందని ఘాటుగా విమర్శించారు. జ్ఞాన్వాపీ మసీదు వ్యవహారాన్ని వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతమవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. జిల్లా కోర్టు జ్ఞాన్వాపి మసీదుకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లకు తాను వ్యతిరేకినన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కమిషన్ సమర్పించిన నివేదికపై ఆయన స్పందించారు. ఇలాంటి తప్పుడు ఎన్కౌంటర్లు చట్టబద్ధమైనపాలనను బలహీనపరుస్తాయని పేర్కొన్నారు.