ఊట్లపల్లిలో పారిశుధ్య పనులు
ABN , First Publish Date - 2021-04-24T04:57:36+05:30 IST
ఊట్లపల్లిలో కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో వరుసగా మృతిచెండటం, గ్రామంలో గతంలోనే దాదాపు 18వరకు కేసులు ఉండగా శుక్రవారం మరో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టారు.
ప్రబలుతున్న కేసులు...వరుస మరణాలతో భయాందోళన
అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 23: ఊట్లపల్లిలో కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో వరుసగా మృతిచెండటం, గ్రామంలో గతంలోనే దాదాపు 18వరకు కేసులు ఉండగా శుక్రవారం మరో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టారు. పాలకవర్గం, అధికారులు కలిసి గ్రామంలో లాక్డౌన్ విధించారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే దుకాణాలు తెరవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో శుక్రవారం గ్రామంలో దుకాణాలను మూసే ఉంచారు. సర్పంచ్ సాధు జోత్న్సబాయి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో రహదారుల వెంట బ్లీచింగ్ చల్లటంతో పాటు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామ్, పాలకవర్గసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరిలోనూ భయాందోళనలు
గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే గ్రామానికి చెందిన ఇద్దరు కరోనాతో మరణించగా, అందులో ఒకరు కేవలం కరోనా సోకిన తనకు ఏమవుతుందనే భయంతోనే కుటుంబసభ్యుల ముందే కన్నుమూశారు. గ్రామంలో శుక్రవారం కూడా మరో పది వరకు కేసులు నమోదయ్యాయి. గ్రామంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం, ప్రైమరీ కాంటాక్టులకు ఎక్కువ మొత్తంలో కరోనా లక్షణాలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది.