లక్నోలో పోల్ ట్రీ కార్యక్రమం ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-23T13:47:40+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లా అధికారులు పోల్ ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు...
పోలింగ్ కేంద్రాల వద్ద మొక్కలు నాటిన మొదటి పురుష, మహిళా ఓటర్లు
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లా అధికారులు పోల్ ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘లక్నో నే థానా హై, ఓటింగ్ రికార్డ్ బనానా హై’ అనే నినాదంతో బుధవారం పోలింగ్ సందర్భంగా ప్రతీ పోలింగ్ బూత్ వద్ద మూడు మొక్కలు నాటారు. మొదటి మహిళా, పురుష ఓటర్లు మొదటి రెండు మొక్కలు నాటారు.మూడో మొక్కను బూత్ అధికారులు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఓటు ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మొక్కలు కూడా ముఖ్యమని ప్రజలకు చెప్పాలనుకుంటున్నామని లక్నో డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్ తెలిపారు.
ఓటుతోపాటు మొక్కలు నాటేలా ప్లాంటేషన్ డ్రైవ్ ను ప్రారంభించామని మెజిస్ట్రేట్ చెప్పారు.లక్నో జిల్లాలోని 4,062 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఓటర్లు మొక్కలు నాటారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం తాము మొక్కలు నాటామని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు.