సర్పంచే.. పారిశుధ్య కార్మికుడై
ABN , First Publish Date - 2021-09-30T06:14:52+05:30 IST
పది రోజులుగా పుదిపట్ల పంచాయతీకి చెత్త ట్రాక్టరును అధికారులు నిలిపేయడంతో సర్పంచ్ బడి సుధాయాదవ్ చెత్త సేకరించడం ప్రారంభించారు.
ఖాకీ నిక్కరు, చొక్కా ధరించి.. విజిల్ వేస్తూ రిక్షా తొక్కుకుంటూ వచ్చి.. చెత్త సేకరిస్తున్న ఈయన పారిశుధ్య కార్మికుడు కాదు.. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సర్పంచ్ బడి సుధాయాదవ్. పది రోజులుగా ఈ పంచాయతీకి చెత్త ట్రాక్టరును అధికారులు నిలిపేశారు. ఈ క్రమంలో తానే చెత్త సేకరిస్తూ బుధవారం నిరసన తెలిపారిలా.ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన తనపై అధికారులు పరోక్షంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పంచాయతీ ఖజానాలో నిధులున్నా, గ్రామానికి అధికారులు నయాపైసా కూడా ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా చెత్త ట్రాక్టర్, మూడు చక్రాల సైకిళ్లను ఆపేయడంతో చెత్త పేరుకుపోయిందన్నారు. దీని తొలగింపునకు సొంతంగా రూ.4 లక్షలు ఖర్చు చేశానన్నారు. ఆపై వెచ్చించే స్తోమత లేక ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని నిర్ణయించానన్నారు. తనను గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచ్గా తనకుందన్నారు.గ్రామ సమస్యలపైనా అధికారులు స్పందించడంలేదని, ఇకనైనా మారకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఉప సర్పంచి రేవతి, వార్డు సభ్యులు హేమభూషణ్, ఈశ్వరయ్య, సిద్ధయ్య, మునిశంకర్, రాజశేఖర్, రుక్మిణి, సింగిల్విండో మెంబర్ మునిరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
- తిరుపతి రూరల్