ఆత్మ గౌరవాన్ని కాలరాయొద్దు

ABN , First Publish Date - 2022-09-27T05:52:11+05:30 IST

గ్రామ సచివాలయాల వలంటీర్లు స్వతంత్రశాఖ ఉద్యోగులుగా.. గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు సంబంధం లేకుండా పోటీ వ్యవస్థగా పనిచేస్తున్నారని, ఇది తమ ఆత్మగౌరవాన్ని, గౌరవ మర్యాదలను కాలరాచినట్లేనని గ్రామ సర్పంచులు ఆరోపించారు.

ఆత్మ గౌరవాన్ని కాలరాయొద్దు
భిక్షాటన చేస్తున్న సర్పంచులు

సచివాలయాలతో సమాంతరపాలన

భిక్షాటనతో గ్రామ సర్పంచుల నిరసన


నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 26 : గ్రామ సచివాలయాల వలంటీర్లు స్వతంత్రశాఖ ఉద్యోగులుగా.. గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు సంబంధం లేకుండా పోటీ వ్యవస్థగా పనిచేస్తున్నారని, ఇది తమ ఆత్మగౌరవాన్ని, గౌరవ మర్యాదలను కాలరాచినట్లేనని గ్రామ సర్పంచులు ఆరోపించారు. ఈ విధానం తగదని, సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను, వలంటీర్లను తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్పంచుల సంఘం నాయకులు, సర్పంచులు సోమవారం నెల్లూరులో భిక్షాటన ద్వారా నిరసన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులైన వలంటీర్లకే ఎక్కువ అధికారులు ఉండటం సిగ్గుచేటన్నారు. సచివాలయ శాఖను గ్రామ పంచాయతీలలో విలీనం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీ కార్యాలయాలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని, జాతీయ ఉపాధిహామీ పథకం పనుల ఎంపిక, పర్యవేక్షణాధికారాలను సర్పంచులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడం అన్యాయమన్నారు. ఆ నిధులను వెంటనే పంచాయతీల ఖాతాలలో జమచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎంఎఫ్‌ఎస్‌ పరిధి నుంచి గ్రామ పంచాయతీల ఖాతాలను వేరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కందమూరి శివకుమార్‌, దేవారెడ్డి నాగేంద్రరెడ్డి, కలవకోలు మునీష్‌, జీ పెంచలయ్య, జెట్టి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భిక్షాటన అనంతరం జేసీ కూర్మనాథ్‌కు వినతిపత్రం ఇచ్చారు. 

Updated Date - 2022-09-27T05:52:11+05:30 IST