కూతుళ్లతో కలిసి ముంబయి వెళ్లిన సత్యమూర్తి?

ABN , First Publish Date - 2022-06-27T05:17:50+05:30 IST

కూతుళ్లతో కలిసి ముంబయి వెళ్లిన సత్యమూర్తి?

కూతుళ్లతో కలిసి ముంబయి వెళ్లిన సత్యమూర్తి?
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సత్యమూర్తి, ఆయన కూతుళ్లు

  • ఎయిర్‌పోర్టు సీసీ కెమెరా ఫుటేజీల్లో సత్యమూర్తి, ఆయన కూతుళ్ల కదలికలు
  • ముగ్గురూ ముంబయి వెళ్లినట్టు పోలీసుల అనుమానం.. వివరాల సేకరణ
  • సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు : తాండూరు డీఎస్పీ

తాండూరు, జూన్‌ 26: తన భార్య మిస్సింగ్‌ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదని, 48గంటల్లోగా ఆచూకీ కనుగొనాలని గడువిచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన బీఎస్పీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి, అతడి కూతుళ్ల కదలికలు ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని పోలీసు ల నిర్ధారించినట్టు తెలిసింది. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి ముంబాయి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యమూర్తికి సంబంధించిన వివరాలను తాం డూరు పోలీసులు ఆదివారం వివరించారు. మూడున్నర నెలల క్రితం(మార్చి 6న) సత్యమూర్తి భార్య అన్నపూర్ణ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. మార్చి 8న అత డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తన భార్య ఆచూకీని కొనుగొనడం లేదన్న ఆవేదనలో సత్యమూర్తి కూతుళ్లతో కలిసి శనివారం ఓ సెల్ఫీ వీడియో, ఆడియోను విడుదల చేశాడు. తన భార్య అదృశ్యం కేసును ఛేదించాలని పోలీసులకు 48గంటల గడువిచ్చాడు. లేదంటే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని, ఆత్మహత్య చేసుకునే లొకేషన్‌ను సోషల్‌ మీడియాలో పెడతానని సత్యమూర్తి తెలిపాడు. అనంతరం కొద్ది సేపటికే సత్యమూర్తి పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసుపై తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి బృందాలను రంగంలోకి దింపి అన్నపూర్ణ ఆచూకీ కోసం విచారణ ముమ్మరం చేశారు. సత్యమూర్తి తన కూతుళ్లతో కారులో పరిగి మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో సత్యమూర్తి కారును గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన సత్యమూర్తి, అతడి కూతుళ్ల కదిలికల ఫుటేజీలను పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగా సత్యమూర్తి ముంబయి చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-06-27T05:17:50+05:30 IST