సత్యేంద్ర జైన్కు Padma vibhushan ఇవ్వాలి: Kejriwal
ABN , First Publish Date - 2022-06-01T21:46:55+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జూన్ 9వ తేదీ వరకూ ఈడీ కస్టడీలోకి తీసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్కు..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (money laundering) కేసులో అరెస్టయి జూన్ 9వ తేదీ వరకూ ఈడీ కస్టడీలోకి తీసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar jain)కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) మరోసారి దన్నుగా నిలిచారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని, రాజకీయ ఉద్దేశాలున్నాయని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. తాజాగా ఆయన సత్యేంద్ర జైన్కు 'పద్మ విభూషణ్' (padma vibhushan) ఇవ్వాలంటూ కితాబిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీకి మొహల్లా క్లినిక్లు అందించిన సత్యేంద్ర జైన్ ప్రతిష్టాత్మక 'పద్మ విభూషణ్' అవార్డుకు అర్హుడని కేజ్రీవాల్ అన్నారు. ''మొహల్లా క్లినిక్ మోడల్ తీసుకువచ్చినందుకు యావద్దేశం ఆయనను చూసి గర్వించాలి. ఐక్యరాజ్యసమితి (UN) మాజీ ప్రధాన కార్యదర్శితో సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ క్లినిక్లను సందర్శించారు. ఉచితంగా ప్రజలకు చికిత్స అందించే హెల్త్ మోడల్ను జైన్ అందించారు. ఇందుకు గాను ఆయనకు అత్యున్నత అవార్డులైన పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ ఇవ్వాలి'' అని కేజ్రీవాల్ చెప్పినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. సీబీఐ కూడా గతంలో తన మంత్రి సత్యేంద్ర జైన్కు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇప్పుడు ఈడీ దర్యాప్తు సాగిస్తోందని, మళ్లీ మరోసారి ఆయన క్లీన్చిట్తో బయటపడతారని కేజ్రీవాల్ అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తప్పుడు కేసులు నిలబడవని, జైన్ ఎలాంటి కళంకం లేకుండా బయటపడాతారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.