వీసాల రెన్యువల్‌పై Saudi Arabia కీలక నిర్ణయం.. భారత్ సహా 17 దేశాల వారికి ప్రయోజనం!

ABN , First Publish Date - 2021-12-01T18:57:37+05:30 IST

వలసదారులకు ఇచ్చే వివిధ వీసాల రెన్యువల్ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

వీసాల రెన్యువల్‌పై Saudi Arabia కీలక నిర్ణయం.. భారత్ సహా 17 దేశాల వారికి ప్రయోజనం!

రియాద్: వలసదారులకు ఇచ్చే వివిధ వీసాల రెన్యువల్ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల రెన్యువల్‌కు ప్రవాసుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. రెసిడెన్సీ, ఎగ్జిట్, రీఎంట్రీ, విజిట్ వీసాలను వలసదారులు పూర్తి ఉచితంగా రెన్యువల్ చేసుకోవచ్చని సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ (జవాజత్) సోమవారం వెల్లడించింది. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్, పాకిస్థాన్ సహా 17 దేశాల ప్రవాసులకు లబ్ధి చేకూరనుంది. 


ఈ జాబితాలో ఇండోనేషియా, పాకిస్థాన్, ఇండియా, టర్కీ, లెబనాన్, ఈజిప్ట్, బ్రెజిల్, ఈథోపియా, వియత్నాం, ఆఫ్గనిస్థాన్, దక్షిణ ఆఫ్రికా, జాంబియా, నమీబియా, మొజాంబిక్, బోట్స్వానా, లెసోతో, ఈశ్వతిని ఉన్నాయి. 2022, జనవరి 31 వరకు జవాజత్ ఇలా ప్రవాసుల రెసిడెన్సీ, ఎగ్జిట్, రీఎంట్రీ, విజిట్ వీసాలను ఆటోమెటిక్‌గా రెన్యువల్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీనికి వలసదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, కింగ్‌డమ్‌లో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రవాసులు ఎవరైతే బయటి దేశాలకు వెళ్లారో వారి ఎగ్జిట్, రీఎంట్రీ వీసాలకు మాత్రం ఇది వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.    


Updated Date - 2021-12-01T18:57:37+05:30 IST