ఉగ్రవాదానికి రాజమార్గం తబ్లిగి జమాత్ : సౌదీ అరేబియా

ABN , First Publish Date - 2021-12-12T18:36:14+05:30 IST

తబ్లిగి జమాత్‌ను సౌదీ అరేబియా నిషేధించింది

ఉగ్రవాదానికి రాజమార్గం తబ్లిగి జమాత్ : సౌదీ అరేబియా

న్యూఢిల్లీ : తబ్లిగి జమాత్‌ను సౌదీ అరేబియా నిషేధించింది. ఈ సంస్థ సమాజానికి ప్రమాదకరమని, ఉగ్రవాదానికి రాజమార్గాల్లో ఒకటని పేర్కొంది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ సంస్థ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకోవడంపై అందరినీ హెచ్చరించాలని మసీదులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. 


రానున్నశుక్రవారం ప్రార్థనల్లో కొంత సమయాన్ని కేటాయించి తబ్లిగి, దావా గ్రూప్‌ గురించి ప్రజలను హెచ్చరించాలని మసీదులకు, బోధకులకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్-అల్‌షేక్ ఆదేశించారని ఓ ట్వీట్‌లో ఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తబ్లిగి జమాత్ వల్ల సమాజానికి కలిగే ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలని కోరింది. ఈ సంస్థ చెప్పుకుంటున్నది ఏది అయినప్పటికీ, అదొక ఉగ్రవాద రాజమార్గమని స్పష్టం చేసింది. పక్షపాతాన్ని ప్రదర్శించే తబ్లిగి, దావా గ్రూప్ వంటి సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం నిషిద్ధమని తెలిపింది. 


తబ్లిగి జమాత్ అనేది అంతర్జాతీయ సున్నీ ఇస్లామిక్ సంస్థ. సున్నీ ఇస్లాంను కచ్చితంగా పాటించాలని ముస్లింలను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో 2020 మార్చిలో వీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చినవారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతో కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో దాదాపు 4 వేల మందికి పైగా ఈ వ్యాధికి గురయ్యారు. సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-12-12T18:36:14+05:30 IST