30 ఏళ్లుగా బాత్రుమ్లో సమోసాల తయారీ.. సౌదీ రెస్టారెంట్లో దారుణం..
ABN , First Publish Date - 2022-04-27T01:49:47+05:30 IST
రెస్టారెంట్ అంటే ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఆహారం తయారీ సమయంలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎన్నారై డెస్క్: రెస్టారెంట్ అంటే ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఆహారం తయారీ సమయంలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ సౌదీ అరేబియాలోని ఓ రెస్టారెంట్ మాత్రం ఇటువంటి రూల్స్ ఏవీ పట్టించుకోలేదు. ఏకంగా బాత్రూమ్లోనే సమోసాల తయారీ చేపట్టింది. ఏకంగా దశాబ్దాల పాటు యథేచ్ఛగా ఇలాంటి నీచానికి పాల్పడింది. ఇటీవలే ఈ దారుణానికి అధికారులు ముగింపు పలికారు.
జెడ్డాలో ఈ రెస్టారెంట్ గత ముప్ఫై ఏళ్లుగా ఇలాంటి నీచానికి పాల్పడుతూనే వస్తోంది. అంతేకాకుండా.. ఎక్స్పైరీ డేట్ ముగిసిన మాంసం, జున్నును ఆహార తయారీలో ఉపయోగించేది. రెండేళ్ల క్రితమే ఎక్స్పైరీ డేట్ ముగిసిన మాంసాన్ని రెస్టారెంట్లో స్థానిక మున్సిపాలిటీ అధికారులు చూసి షాకైపోయారు. ఇక.. అక్కడి సిబ్బందికి కూడా ఎటువంటి హెల్త్ కార్డులు లేవని గుర్తించారు. రెస్టారెంట్ ఇలా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం గురించి అధికారులకు ఉప్పందడంతో వారు ఇటీవలే రెయిడ్ చేసి.. రెస్టారెంట్ మూసేశారు. ప్రస్తుతం సౌదీ సోషల్ మీడియాలో ఈ ఘటన విపరీతంగా వైరల్ అవుతోంది.