Savarkar Row: కాంగ్రెస్ కార్యాలయం వద్ద సావర్కర్ పోస్టర్లు ప్రత్యక్షం

ABN , First Publish Date - 2022-08-22T23:03:59+05:30 IST

కర్ణాటకలోని విజయపుర కాంగ్రెస్ కార్యాలయంలో వినాయక్ దామోదర్ సావర్కర్ ..

Savarkar Row: కాంగ్రెస్ కార్యాలయం వద్ద సావర్కర్ పోస్టర్లు ప్రత్యక్షం

విజయపుర: కర్ణాటకలోని విజయపుర కాంగ్రెస్ కార్యాలయం (Congress office)  వద్ద వినాయక్ దామోదర్ సావర్కర్ (VD Savarkar) పోస్టర్లు (posters) ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. కొందరు అగంతకులు ఆదివారం రాత్రి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఈ పోస్టర్లు ఉంచినట్టు చెబుతున్నారు. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. శివమొగ్గలో సావర్కర్ పోస్టర్ల వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు స్వాతంత్ర దినోత్సవం రోజున ఘర్షణలకు దారితీసిన నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది.


కాగా, సావర్కర్ పోస్టర్లు అతికించడాన్ని బీజేపీ కార్యకర్త ఒకరు సమర్ధించారు. సావర్కర్ ఫోటోను గతంలో అతికించిన వారిలో తాను కూడా ఉన్నామని, హుబ్లిలో కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలో సావర్కర్ ఫోటోను దగ్ధం చేశారని, సావర్కర్‌ను కాంగ్రెస్ పార్టీ తరచు వివాదం చేస్తోందని ఆయన అన్నారు. ఫోటో అతికించడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ప్రచారం కోసం సావర్కర్ పేరును కాంగ్రెస్ వాడుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ముందు సావర్కర్ పుస్తకాలు చదవి, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన ఫోటోలను దగ్ధం చేయడం ద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.


కాగా, పార్టీ కార్యాలయంపై అతికించిన సావర్కర్ పోస్టర్లు తొలగించాలని ఉడపి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు అతికించి ఆ తర్వాత వాటిని తొలగించడం ద్వారా సమస్యలు సృష్టించాలని చూస్తుండటం విచాకరమని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. పోస్టర్ల రక్షణకు వాళ్లు (బీజేపీ) పోలీసులను పంపుతున్నారని, ఇది సిగ్గుచేటని అన్నారు. ఆ విషయంపైనే తాము అభ్యంతరం చెబుతున్నామని చెప్పారు.


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక పోలీసు గత  సోమవారం శివమొగ్గ జిల్లాలోని కొన్ని చోట్ల సెక్షన్ 144 విధించారు. సావర్కర్, టిప్పు సుల్తాన్ బ్యానర్ల విషయంలో ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు.


సిద్ధరామయ్య ఏమన్నారంటే...

ముస్లింల ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు వీరసావర్కర్ పోస్టర్లను ఏర్పాటు చేస్తుండటాన్ని గతవారంలో సిద్ధరామయ్య నిలదీశారు. ముస్లిం ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ ఫోటోలను తొలగించి సావర్కర్ ఫోటోలు ఎందుకు ఉంచుతున్నారు? బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల కొడగు జిల్లాలో వర్షబాధిత ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు తన కారుపై బీజేపీ కార్యకర్తలు గుడ్లు విసిరారని, నల్లజెండాలు చూపించారని ఆయన ఆరోపించారు. దీనికి నిరసనగా కొడగు ఎస్‌పీ కార్యాలయాన్ని దిగ్బంధించాలని తాము నిర్ణయించినట్టు చెప్పారు. కాగా, మెజారిటీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆ ప్రాంతవాసులు నిరసన తెలిపారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.


Updated Date - 2022-08-22T23:03:59+05:30 IST