కళాకారులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-01-08T06:34:46+05:30 IST

ప్రజల కోసం మంచి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటుచేసి వారి మానసికోల్లాసానికి తోడ్పడుతూ, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న కళాకారులు, కళాసంస్థలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది...

కళాకారులను ఆదుకోవాలి

ప్రజల కోసం మంచి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటుచేసి వారి మానసికోల్లాసానికి తోడ్పడుతూ, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న కళాకారులు, కళాసంస్థలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ప్రదర్శనలిస్తున్న కళాసంస్థలకు, కళాకారులకు కార్యక్రమం పూర్తయిన రెండు నెలల తరువాత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆయా సంస్థల ఖాతాలలో జమ చేసేది. 2018 నుంచి కార్యక్రమాలు నిర్వహించిన కళా సంస్థలకు మంజూరైన బకాయిలను చెల్లించకుండా, ఆయా సంస్థల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా సాంస్కృతిక శాఖ కాలయాపన చేస్తున్నది. ఆ శాఖామాత్యులను, సంబంధిత అధికారులను అనేకమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినా, కళాకారుల ఇబ్బందులను వివరించినా ఎవరూ పట్టించుకోవడం లేదు.


కళాప్రదర్శన మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారంతా కరోనా పరిస్థితులలో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి రావలసిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. అలాగే మూడు సంవత్సరాలుగా నిలిపివేసిన నంది నాటకోత్సవాలను ప్రభుత్వం  పునరుద్ధరించి కళాకారులను ప్రోత్సహించాలి. మన వారసత్వ సంపదగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఈ దిశగా సంబంధిత అధికారులు కార్యాచరణ రూపొందించాలి.


పోలుదాసు రంగనాయకులు

కార్యదర్శి, ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సేవా సంస్థ, కృష్ణా జిల్లా

Updated Date - 2021-01-08T06:34:46+05:30 IST