ఎస్బీఐ వడ్డీ రేట్లు మరింత ప్రియం
ABN , First Publish Date - 2022-05-16T06:08:42+05:30 IST
ఎంసీఎల్ఆర్ ఆధారిత ఎస్బీఐ రుణాల వడ్డీ రేట్లు మరింత ప్రియం కానున్నాయి.
న్యూఢిల్లీ: ఎంసీఎల్ఆర్ ఆధారిత ఎస్బీఐ రుణాల వడ్డీ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. అదనపు నిధు ల సమీకరణ వ్యయం (ఎంసీఎల్ఆర్) ఆధారంగా నిర్ణయించే ఈ రుణాల వడ్డీ రేట్లను మరో 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రకటించింది. దీంతో ఒక రోజు నుంచి మూడు నెలల కాల పరిమితి ఉండే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెరుగుతాయి. ఇదే విధంగా ఎంసీఎల్ఆర్ ఆధారిత ఆరు నెలల రుణాల వడ్డీ రేటు 7.15 శాతానికి, ఏడాది కాల పరిమితి ఉండే రుణాల వడ్డీ రేటు 7.2 శాతానికి, రెండేళ్ల రుణాల వడ్డీ రేటు 7.4 శాతానికి, మూడేళ్ల రుణాల వడ్డీ రేటు 7.5 శాతానికి పెరుగుతుంది. ఆదివారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు పెంచడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి.