కేరళ ప్రభుత్వ ఆఫ్లైన్ పరీక్షల నిర్ణయానికి 'సుప్రీం' బ్రేక్..
ABN , First Publish Date - 2021-09-04T00:15:32+05:30 IST
ప్లస్ వన్' పరీక్షలను ఈనెల 6 నుంచి 16వ తేదీ వరకూ ఆఫ్లైన్లో నిర్వహించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న..
తిరువనంతపురం: 'ప్లస్ వన్' పరీక్షలను ఈనెల 6 నుంచి 16వ తేదీ వరకూ ఆఫ్లైన్లో నిర్వహించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు వారం రోజుల పాటు స్టే ఇచ్చింది. కేరళలో పరిస్థితి (కోవిడ్ కేసుల్లో పెరుగుదల) చాలా ఆందోళనకరంగా ఉందని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారంనాడు అభిప్రాయపడింది. దేశంలోని మొత్తం కేసుల్లో 70 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండగా, ప్రతి రోజూ 35 వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇలాంటి తరుణంలో తెలిసీ తెలియని వయస్సులోని పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, కొద్ది రోజులుగా కేరళలో రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో టెస్ట్ పాసిటివిటీ రేటు 18.41గా ఉంది. 14 జిల్లాల్లో త్రిసూర్లో అత్యధిక కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానాల్లో ఎర్నాకులం, కోజికోడ్, పాలక్కాడ్, కొల్లాం, మలప్పురం, తిరువనంతపురం, కొట్టాయం, అళపుజ, కన్నూరు, పథనాంతిట్ట, ఇడుక్కి, వయనాడ్ ఉన్నాయి.