ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2021-03-01T05:21:15+05:30 IST
మండల పరిధిలోని పాఠశాలల్లో ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముత్తుకూరు, ఫిబ్రవరి 28: మండల పరిధిలోని పాఠశాలల్లో ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముత్తుకూరులోని ఈదూరు ఈశ్వరమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చెంచురామయ్య ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికశాస్త్రంలో పరిశోధనలకు సీవీ రామన్ నోబుల్ బహుమతి పొందారన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఎంతో కీలక పాత్ర నిర్వహిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అందించే సైన్స్ మానవ మనుగడకు తోడ్పడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమానాలను పరిశీలించారు. కృష్ణపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ నమూనాల ప్రదర్శన నిర్వహించారు.
ఇందుకూరుపేటలో..
ఇందుకూరుపేట, ఫిబ్రవరి 28 :ఇందుకూరుపేట గ్రంథాలయంలో ఆదివారం సైన్స్డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. సీవీ రామన్, అబ్ధుల్ కలాం వంటి శాస్త్రవేత్తల గురించి వివరించారు. అధికారి డీవీ సుజాత మాట్లాడుతూ సీవీ రామన్ నోబుల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రమే కాక ఖగోళం, వాతావరణం వంటి అనేక రంగాల్లో కీర్తి పొందారన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తిప్పావజ్ఞల సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
తోటపల్లిగూడూరులో..
తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 28 : మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయుడు ఫణికుమార్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నోబుల్ అవార్డు గ్రహీత సీవీ రామన్ చేసిన ప్రయోగాలను భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.