స్కూల్ బస్సు బోల్తా
ABN , First Publish Date - 2022-08-19T04:47:14+05:30 IST
ఓ ప్రైవేటు స్కూలు బస్సు బోల్తాపడంతో ఒక విద్యార్థి తీవ్రంగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
ఓ విద్యార్థికి తీవ్ర, పలువురికి స్వల్ప గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 18 : ఓ ప్రైవేటు స్కూలు బస్సు బోల్తాపడంతో ఒక విద్యార్థి తీవ్రంగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. స్కూల్ బస్సు గురువారం మినగల్లు నుంచి బుచ్చికి వేగంగా వస్తుండగా మార్గమధ్యంలో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా విద్యార్థులందరూ హాహాకారాలు పెట్టి భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహాపురం(దేవరపాళెం) గ్రామానికి చెందిన ప్రదీప్ తీవ్రంగా, పలువురు చిన్నారులు స్వల్పంగాయపడ్డారు. బస్సులో నరసింహాపురం, మినగల్లు గ్రామాల విద్యార్థులు 15మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, పరిసరాల రైతులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని బుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ కే. వీర ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫిట్నెస్పై దృష్టి సారించాలి
స్కూలు బస్సుల ఫిట్నెస్పై అధికారులు దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కోవూరు మహేష్ ఎంఈవోకి వినతిపత్రం అందజేశారు. స్కూలు బస్సుల రవాణాలో నిబంధనల మేరకు రవాణాశాఖ అధికారులు సత్వర చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
స్కూలు వాహనాల ఆధార పత్రాలు ఇవ్వాలి
మండలంలోని ప్రైవేటు పాఠశాలల బస్సులు, వ్యాన్లకు రవాణాశాఖ నిబంధనల మేరకు ఉన్న ఆధార పత్రాలను పరిశీలన నిమిత్తం ఇవ్వాలని మండల విద్యాశాఖ అధికారి దిలీప్కుమార్ ప్రైవేటు పాఠశాలల కరస్పాండెట్స్కు సూచించారు. గురువారం మండలంలోని మినగల్లు వద్ద జరిగిన ఓ ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా కొట్టిన ప్రమాదంపై ఆయన స్పందించి మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే ఉపయోగించి పాఠ్యాంశాలు బోధించాలని ఆదేశించారు. నిత్యం విద్యార్థుల హాజరును ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. సమావేశంలో సీఆర్పీ మల్లేశ్వరరెడ్డి, పలువురు కరస్పాండెంట్లు పాల్గొన్నారు.