నేటి నుంచి 6, 7, 8వ తరగతులు షురూ..
ABN , First Publish Date - 2021-02-24T04:59:25+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 6, 7, 8వ తరగతులు
- తల్లిదండ్రులు అంగీకార పత్రం ఇస్తేనే పాఠశాలకు అనుమతి
- విద్యార్థుల మధ్య భౌతికదూరం నిబంధన సాధ్యమయ్యేనా..?
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 6, 7, 8వ తరగతులు చదివే విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈనెల ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన ప్రభుత్వం... నేటి నుంచి ప్రాథమికోన్నత తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది. ఈనెల 24నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మధ్యలో ఎప్పుడైనా 6,7,8 తరగతులు ప్రారంభించుకునే సౌలభ్యం పాఠశాలలకు కల్పించింది. కొవిడ్ మార్గదర్శకాలను విధిగా పా టించాలని, విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించేందుకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశా రు. వికారాబాద్ జిల్లాలో 496 ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో 6, 7, 8వ తరగతులు చదివే విద్యార్థులు 39, 882 మంది ఉన్నారు. వీరిలో 6వ తరగతి విద్యార్థులు 11,906 మంది ఉండగా, 7వ తరగతి విద్యార్థులు 14,285, 8వ తరగతి విద్యార్థులు 13,691 మంది ఉన్నారు. 284 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 6, 7, 8వ తరగతులు చదివే విద్యార్థులు 20,565 మంది ఉండగా, 18 కేజీబీవీల్లో 1,953, 9 టీఎస్ఎంఎస్ల్లో 1,883 మంది, 153 ప్రైవేట్ పాఠశాలల్లో 9,560 మంది విద్యార్థులు ఉన్నారు. 8 బీసీ గురుకుల పాఠశాలల్లో 1,643 మంది, 10 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1,706 మంది, 8 ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 1,639 మంది, 6 మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 933 మంది విద్యార్థులు ఉన్నారు.
భౌతిక దూరం సాధ్యమయ్యేనా...?
బుధవారం నుంచి పాఠశాలలకు 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు హాజరయ్యే అవ కాశం ఉన్నందున ప్రత్యక్ష విద్యా బోధనకు అనుగుణంగా ఏర్పాట్లు ప్రారంభించారు. మునిసిపల్, మం డల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష విద్యా బోధన ఎలా చేపట్టాలనే విషయమై ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో విద్యార్థుల మధ్య భౌతికదూరం ఏ మేరకు సాధ్యమవుతుందనే విషయమై వారు తర్జనభర్జన పడుతున్నారు. 6, 7, 8వ తరగతులకు బోధించే గదు లను ఇంకా శానిటైజ్ చేయాల్సి ఉంది. అంతే కాకుండా తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న తరువాతనే విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ బడులకు సంబంధించిన 6,7,8వ తరగతి 56,005 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అలాగే ప్రైవేట్ సెక్టారుకు సంబంధించి 1,15,437 మంది విద్యార్థులు బడికి వెళ్లనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు కొనసాగించనున్నట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు.