పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో అతడు ఏం రాశాడో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-03-11T05:36:24+05:30 IST
ఆ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. మార్కుల కోసం స్కూళ్లో టీచర్లు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. స్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్లు, తోటి విద్యార్థుల వేధింపులను భరించలేకపోయాడు...
ఆ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. మార్కుల కోసం స్కూళ్లో టీచర్లు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. స్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్లు, తోటి విద్యార్థుల వేధింపులను భరించలేకపోయాడు. తమ ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గౌరవ్ అనే విద్యార్థి ఇటీవల 17వ అంతస్థులో ఉన్న తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి దూకి చనిపోయాడు.
తన మృతికి పాఠశాల, ప్రధానోపాధ్యాయురాలు, ఇతర విద్యార్థులే కారణమని విద్యార్థి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. `అమ్మా.. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లివి నువ్వు. నేను ధైర్యంగా ఉండలేకపోయినందుకు క్షమించు. ఈ స్కూల్ నన్ను చంపింది. ద్వేషంతో నిండిన ఈ ప్రపంచంలో నేను జీవించలేను అని రాశాడు. జీవించి ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ, నా వల్ల కాలేదు. నువ్వు దేవదూతవి. ఈ జన్మలో నిన్ను పొందడం నా అదృష్టం. నేను బలహీనుడిని, నన్ను క్షమించు` అని సూసైడ్ నోట్లో గౌరవ్ రాశాడు.
పాఠశాల యాజమాన్యంపై గౌరవ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాలకు చెందిన ఓ టీచర్పై గతంలోనే ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేశానని, అయినా పట్టించుకోలేదని ఆమె పోలీసులకు చెప్పారు. సూసైడ్ నోట్ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. కాగా, గౌరవ్ను వేధించిన టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.