400 మంది తలదాచుకున్న స్కూల్‌పై రష్యా దాడి

ABN , First Publish Date - 2022-03-20T20:42:32+05:30 IST

ఇప్పటికే మరియపోల్‌లోని సినిమా థియేటర్‌పై దాడి చేసిన రష్యా, తాజాగా ఆదివారం అక్కడి స్కూల్‌పై బాంబు దాడి చేసింది. ఈ స్కూల్‌లో దాదాపు 400 మంది పౌరులు తలదాచుకున్నారు.

400 మంది తలదాచుకున్న స్కూల్‌పై రష్యా దాడి

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై బాంబులు కురిపించడంతోపాటు సూపర్‌సోనిక్ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సైనికులతోపాటు, సాధారణ ప్రజలు తలదాచుకున్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటికే మరియుపోల్‌లోని సినిమా థియేటర్‌పై దాడి చేసిన రష్యా, తాజాగా ఆదివారం అక్కడి స్కూల్‌పై బాంబు దాడి చేసింది. ఈ స్కూల్‌లో దాదాపు 400 మంది పౌరులు తలదాచుకున్నారు. ఈ ఘటనలో స్కూల్ భవనం భారీగా ధ్వంసమైంది. అయితే, ఎంతమంది గాయపడ్డారో, ఎంత మంది మరణించారో అనే సమాచారం ఇంకా అందలేదు.


ఉక్రెయిన్‌లో కీలక నగరమైన మరియుపోల్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. దీంతో అక్కడ తలదాచుకున్న పౌరులకు ఆహారం, నీరు, ఎలక్ట్రిసిటీ వంటి సదుపాయాలు అందడం లేదు. ప్రస్తుతం మరియుపోల్‌లో దాదాపు నాలుగు లక్షల మంది తలదాచుకున్నారు. రష్యా చర్యతో దాదాపు వీళ్లంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా చేస్తున్న అరాచకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆదివారం నాటికి రష్యా దాడి 25వ రోజుకు చేరుకుంది. 

Updated Date - 2022-03-20T20:42:32+05:30 IST