సైన్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి
ABN , First Publish Date - 2021-03-01T05:28:25+05:30 IST
ప్రతీఒక్కరు సైన్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని నన్నయ యూనివర్శిటీ ప్రొఫెసర్ విజయనిర్మల అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 28: ప్రతీఒక్కరు సైన్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని నన్నయ యూనివర్శిటీ ప్రొఫెసర్ విజయనిర్మల అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.డేవిడ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయనిర్మల, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.కృష్ణ పొడగట్లపల్లి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణలు విద్యార్థుల చదువు, నైపుణ్యం, పనితీరును ప్రభావితం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓపెన్ డేకు నగరంలోని విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కళాశాలలోని అన్ని సైన్స్ విభాగాల ప్రయోగశాలలు, మ్యూజియం ప్రజలు, విద్యార్థుల సందర్శన కోసం తెరచి ఉంచారు. విద్యార్థులు పలు నూతన ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. అనంతరం క్విజ్, వక్తృత్వం, ప్రాజెక్టు వివరణ పోటీల్లో విజేతలకు డేవిడ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు బహుమతులు అందజేశారు. సైన్స్ సంచాల సమన్వయకర్తగా కండ్రకుంట బాబు వ్యవహరించారు.