లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యకైంకర్యాలు

ABN , First Publish Date - 2022-01-20T06:45:40+05:30 IST

యాదాద్రి నృసింహుడి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు ఘనం గా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యపూజలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి.

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యకైంకర్యాలు
నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

వీవీఐపీల బసకు సిద్ధమవుతున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌


యాదాద్రి టౌన్‌, జనవరి 19: యాదాద్రి నృసింహుడి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు ఘనం గా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యపూజలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆస్థానపరంగా ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాల తో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణోత్సలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరస్వామికి, చరమూర్తులకు నిత్య పూజలు, కొండకింద వ్రతమండపంలో సత్యనారాయణస్వామి వ్రతారాధనలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తులు హరిహరులను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్యార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆల య ఖజానాకు రూ.7,29,462 ఆదాయం సమకూరింది. 


స్వామిసేవలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌

యాదాద్రీశుడిని బుధవారం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నా రు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం నిర్వహించగా.. దేవస్థాన అధికారులు అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.


వెండి కలశాల బహూకరణ

నిజాభిషేక పూజల్లో వినియోగించే వెండి కలశాలను పలువురు భక్తులు బహూకరించారు.  హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఎన్‌.వెంకటచలపతిరావు 395గ్రాముల వెండి కలశం, అదేవిధంగా గీతాభాస్కర్‌, తరుణ్‌భాస్కర్‌, గద్వాలకు చెందిన భక్తులు సాయికృష్ణ 380 గ్రాముల వెండి కలశాన్ని స్వామివారికి బహూకరించారు. వీటిని సంప్రోక్షణ పూజలనంతరం నిత్య పూ జా కైంకర్యాల్లో వినియోగించనున్నట్లు అర్చకులు తెలిపా రు. ఇదిలా ఉంటే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పను లు దాదాపు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో వీవీఐపీ లు బస చేసేందుకు కొండకు ఉత్తర దిశలో సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ విల్లాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రూ.105కోట్లతో ప్రెసిడెన్షియల్‌ విల్లాను నిర్మించారు. ఆర్‌సీసీ పనులు పూర్తి చేసిన అధికారులు ఎలక్ట్రిసిటీ, సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నా రు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లాల డ్రోన్‌ కెమెరా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Updated Date - 2022-01-20T06:45:40+05:30 IST