ఆసుపత్రుల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-30T04:47:23+05:30 IST

ప్రైవేటు దవాఖానాల్లో వైద్యాధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. వారి తనిఖీల్లో ఆస్పత్రుల్లో లోపాలు బయటపడుతున్నాయి. అరకొర వసతులు, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న వైద్యులు కనిపించకపోవడం, నిబంధనలు పాటించకుండా నడుస్తున్న పరీక్షా కేంద్రాలు, చార్జీల వివరాల పట్టిక ప్రదర్శించకపోవడం తదితర లోపాలను అధికారులు గుర్తిస్తున్నారు.

ఆసుపత్రుల్లో తనిఖీలు
మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో తనిఖీలు చేస్తున్న అధికారుల బృందం

మెదక్‌ జిల్లాలో 8 హాస్పిటల్స్‌కు నోటీసులు


మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 29: ప్రైవేటు దవాఖానాల్లో వైద్యాధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. వారి తనిఖీల్లో ఆస్పత్రుల్లో లోపాలు బయటపడుతున్నాయి. అరకొర వసతులు, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న వైద్యులు కనిపించకపోవడం, నిబంధనలు పాటించకుండా నడుస్తున్న పరీక్షా కేంద్రాలు, చార్జీల వివరాల పట్టిక ప్రదర్శించకపోవడం తదితర లోపాలను అధికారులు గుర్తిస్తున్నారు. మెదక్‌ పట్టణంలో వైద్యాధికారి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం గురువారం మెదక్‌ డెంటల్‌, జయలక్ష్మి, హెల్ప్‌, శ్రీనివాస డెంటల్‌ క్లినిక్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఆదిత్య డయాగ్నోస్టిక్‌, ఆదిత్య హాస్పిటల్‌కు నోటిసులు జారీ చేసినట్టు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో విజయనిర్మల తెలిపారు. రామాయంపేటలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో లలితాదేవి నర్సింగ్‌హోం, వైబీ మల్టీస్పెషాలిటీ, ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌, రాఘవేంద్ర నర్సింగ్‌హోం, సంజీవిని మల్టీస్పెషాలిటీ, శ్రీబాలజీ నర్సింగ్‌హోం, సంజీవిని స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. వైబీ మల్టీస్పెషాలిటీ, ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌, సంజీవిని హాస్పిటల్‌, రాఘవేంద్ర హాస్పిటల్‌, బాలజీ నర్సింగ్‌హోంలకు నోటీసులు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ, ఫైర్‌ సేఫ్టీ, బయోమెడికల్‌ వేస్టేజ్‌ సర్టిఫికెట్లతో పాటు ఫీజుల వివరాలను ప్రదర్శించని కారణంగా నోటిసులు జారీ చేసినట్టు వైద్యాధికారులు వివరించారు. రామాయంపేట రాఘవేంద్ర ఆసుపత్రి డిసెంబర్‌ వరకు తాత్కాలిక రిజిస్ర్టేషన్‌ కలిగి ఉందని చెప్పారు. వారం రోజుల్లో అన్ని అనుమతులు పొందకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హెచ్చరించారు.

Updated Date - 2022-09-30T04:47:23+05:30 IST