Lakhimpur Kheri: కేసులో నిందితుడైన కేంద్రమంత్రి కుమారుడి కోసం పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2021-10-07T17:39:06+05:30 IST

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారా అంటే అవునంటున్నారు...

Lakhimpur Kheri: కేసులో నిందితుడైన కేంద్రమంత్రి కుమారుడి కోసం పోలీసుల గాలింపు

లక్నో (ఉత్తరప్రదేశ్): లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారా అంటే అవునంటున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో రేంజ్ ఇన్‌స్పెక్టరు జనరల్ (ఐజీ) లక్ష్మీ సింగ్. లఖింపూర్ ఖేరీలో ఊరేగింపు చేస్తున్న రైతులపై కారు నడిపి నలుగురి మృతికి కారణమైన ఆశిష్ మిశ్రాను పట్టుకునేందుకు తమ పోలీసు బృందం గాలిస్తుందని ఐజీ లక్ష్మీ సింగ్ చెప్పారు.నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు తీసిన లఖింపూర్ ఖేరీ ఘర్షణ జరిగిన కొన్ని రోజుల తర్వాత, పలు కొత్త వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 


నల్ల జెండాలు చేత పట్టుకుని ప్రదర్శన చేస్తున్న రైతుల గుంపుపై వేగంగా కారు నడిపినట్లున్న వీడియో ఒకటి బయటపడింది. మరో వైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ సూమోటో దర్యాప్తునకు స్వీకరించారు. లఖింపూర్ ఖేరీ హింస సుప్రీం విచారించనున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని, త్వరలో నిందితులను కనిపెట్టి పట్టుకుంటామని లా అండ్ ఆర్డర్ యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన 8మంది కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి రూ.45లక్షల చొప్పున నష్టపరిహారాన్ని యూపీ సర్కారు గురువారం అందజేసింది. 

Updated Date - 2021-10-07T17:39:06+05:30 IST